దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘కరుప్పు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేస్తూ, ఇందులో త్రిష పోషించిన ‘ప్రీతి’ అనే లాయర్ పాత్రకు సంబంధించిన 37 సెకన్ల నిడివి ఉన్న వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో త్రిష లుక్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా త్రిష వయసు రివర్స్లో వెళ్తోందంటూ నెటిజన్లు పెడుతున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే, ఈ ప్రమోషన్ల క్రమంలో త్రిష చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి. సినిమాలో తన పాత్ర గురించి త్రిష స్పందిస్తూ.. కనీసం మేకర్స్ ఇప్పుడైనా రిమైండర్ సెట్ చేశారని సెటైరికల్గా కామెంట్ చేశారు. ఈ క్రమంలో ఒక అభిమాని ‘ఆడియో లాంచ్కు రాకుండా ఈ కబుర్లు ఏంటి?’ అని ప్రశ్నించగా, త్రిష మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తనకు రావాల్సిన ఆహ్వానం బహుశా మెయిల్లో ఎక్కడో పోయి ఉంటుంది అంటూ ఆమె వేసిన కౌంటర్ కోలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఈ వ్యాఖ్యలను బట్టి చిత్ర నిర్మాతలకు, త్రిషకు మధ్య విబేధాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా సినిమా ప్రమోషన్లలో కీలక పాత్ర పోషించాల్సిన హీరోయిన్, ఇలా బహిరంగంగా ఆహ్వానం అందలేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతుండగా, అసలు చిత్ర బృందానికి త్రిషకు మధ్య ఏం జరుగుతోందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




