Sanjay Raut: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో చీలిక, డీఎంకే అసంతృప్తి మధ్య ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ కీలక పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలంటే కాంగ్రెస్ నుంచి విడిపోయిన ప్రాంతీయ పార్టీలు మళ్లీ కాంగ్రెస్లో విలీనం కావాలని సూచించారు. టీఎంసీ, ఎన్సీపీ వంటి పార్టీలు కాంగ్రెస్లో కలవడానికి ఇదే సరైన సమయమని చెప్పారు.
జాతీయ మీడియాతో మాట్లాడిన రౌత్.. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రభావం పెరుగుతోందని, దీనిని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలు బలంగా, ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ బలపడితే ప్రతిపాలకు నాయకత్వం వహించే సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలహీనపరచడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. ఒక దేశం, ఒక పార్టీ, ఒకే ఎన్నిక అనే విధానంతో బీజేపీ ముందుకు వెళ్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలు విడివిడిగా కాకుండా ఒకే వేదికపైకి రావాలని సూచించారు.
మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బెంగాల్ రాజకీయ పరిణామాలు ప్రతిపక్షాలకు ఒక హెచ్చరిక అని చెప్పారు. డీఎంకే-కాంగ్రెస్ విభేదాలపై స్పందిస్తూ.. ఇండియా కూటమిలోనే డీఎంకే కొనసాగాలని కోరారు. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీని ఇండియా కూటమిలో చేరాలని ఆహ్వానించారు.




