DK Shivakumar: కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే డీకే శివకుమార్కు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. సిద్ధరామయ్యను దించి సీఎంగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన డీకేకు మంత్రులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే, సీనియర్ నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రాధాన్యత లేని శాఖను కేటాయించిన కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, కేబినెట్లోని మరో ముగ్గురు మంత్రులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, మంత్రి వర్గంలో సిద్ధరామయ్య అనుచరగణం భారీ సంఖ్యలో ఉండటం, డీకేకు భవిష్యత్తులో ఇబ్బందులను కలుగజేస్తాయని భావిస్తున్న తరుణంలో, కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
కేబినెల్లోని సీనియర్ మంత్రులు తమకు మరిన్ని కీలక బాధ్యల్ని కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మహిళలు, ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. రామలింగారెడ్డికి బెంగుళూరు అభివృద్ధి శాఖను కేటాయిస్తారని అనుకున్నా, నీటి పారుదల శాఖను కేటాయించడంపై అసంతృప్తితో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కే.హెచ్ మునియప్ప, కే.జి జార్జ్, సతీష్ జార్కిహోళిలు కూడా సమస్యగా మారారు.
మునియప్ప తన సీనియారిటీకి తగిన శాఖలు ఇవ్వలేని అసంతృప్తితో ఉన్నారు. జార్జ్ తన శాఖలో అధికారుల బదిలీలపై జోక్యం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. మంత్రి పదవితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశించిన సతీష్ జార్కిహోళి కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ విభేదాలను పరిష్కరించుకుంటామని డీకే శివకుమార్ చెబుతున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్లో పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. సీఎంగా బాధ్యతలు తీసుకున్న సంతోషం డీకేకు ఉండనివ్వకుండా చేస్తున్నారు.
డీకే కేబినెట్లో మహిళా మంత్రికి చోటు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నా్యి. దీనిపై సీనియర్ కాంగ్రెస్ నేత మార్గరేట్ ఆల్వా నిరాశ వ్యక్తం చేశారు. దీనిపై మాట్లాడుతూ, త్వరలోనే మహిళలకు అవకాశం ఇస్తామని సీఎం డీకే శివకుమార్ చెప్పారు. ప్రస్తుతం, కేబినెట్లో యూటీ ఖాదర్ ఒక్కరే ముస్లిం మంత్రిగా ఉన్నారు. నలుగురు మంత్రులకు చోటు కల్పించాలని ముస్లిం నేతలు, మతపెద్దలు డిమాండ్ చేస్తు్న్నారు.




