ఆన్లైన్ షాపింగ్ చేసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింత భద్రత కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-కామర్స్ రూల్స్ 2020కి తగిన సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు అన్నీ కూడా వచ్చే 2027 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా కచ్చితంగా అమలులోకి వస్తాయి. ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ కొత్త మార్పులు తీసుకొచ్చారు.
ఈ-కామర్స్ రంగంలో వినియోగదారుల మోసాలను నివారించడానికి తీసుకొచ్చిన ఈ నిబంధనల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. అందులో మొదటిది డిస్కౌంట్ ధరలకు సంబంధించినది. ఇకపై ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లపై ఏదైనా వస్తువుపై డిస్కౌంట్ ప్రకటిస్తే, ఆ తగ్గించిన కొత్త ధరతో పాటు గత 30 రోజుల్లో ఆ వస్తువుకు ఉన్న అత్యల్ప ధరను కూడా స్పష్టంగా చూపించాలి. ముందుగా ధరను కృత్రిమంగా పెంచి, ఆపై భారీగా ‘70% ఆఫ్’ అని చూపించి వినియోగదారులను ఆకర్షించే తప్పుదోవ పట్టించే పద్ధతులకు దీని ద్వారా పూర్తి అడ్డుకట్ట పడుతుంది.
అలాగే సెర్చ్ ఫలితాలకు సంబంధించి కఠిన మార్పులు తెచ్చారు. వినియోగదారులను తప్పుదోవ పట్టించే విధంగా సెర్చ్ ఫలితాలను తారుమారు చేయడం నిషిద్ధం. ప్రకటనల రూపంలో ఉండే స్పాన్సర్డ్ లిస్టింగ్లను వినియోగదారులకు స్పష్టంగా గుర్తించేలా చూపించాలి. ఇక ఆన్లైన్ షాపింగ్లో వేధించే డార్క్ ప్యాటర్న్లపై కూడా నిఘా పెంచారు. డ్రిప్ ప్రైసింగ్, బాస్కెట్ స్నీకింగ్, సబ్స్క్రిప్షన్ ట్రాప్ల వంటి మోసపూరిత డిజైన్లపై 2023లో తెచ్చిన మార్గదర్శకాలు ఇకపై ప్రతి ఈ-కామర్స్ సంస్థకు తప్పనిసరి. ప్రతి సంస్థ ప్రతిఏటా తప్పకుండా సెల్ఫ్-ఆడిట్ నిర్వహించి, ఆ సర్టిఫికేట్ను బహిరంగంగా ప్రదర్శించాలి.
మరికొన్ని ముఖ్యమైన నిబంధనల ప్రకారం, అందించే ఇన్వాయిస్పై విక్రేత పేరు ప్లాట్ఫామ్ పేరు ఉన్నంత సమానమైన సైజులోనే స్పష్టంగా ముద్రించాలి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కచ్చితంగా ఇంపోర్టర్ వివరాలు, ఆ వస్తువు ఏ దేశం నుంచి తయారై వచ్చిందో తెలిపే కంట్రీ ఆఫ్ ఆరిజిన్ వివరాలు వెల్లడించాలి. ప్రతి ఈ-కామర్స్ సంస్థ నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్తో అనుసంధానం కావడం తప్పనిసరి చేశారు. వచ్చిన ప్రతి ఫిర్యాదు కాపీని వినియోగదారుకు అందించాలి. 2025 సంవత్సరంలో జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్కు (NCH) వచ్చిన మొత్తం 17.71 లక్షల ఫిర్యాదుల్లో దాదాపు 5.11 లక్షలు, అంటే సుమారు 29 శాతం కేవలం ఈ-కామర్స్ రంగానికి చెందినవే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం ఈ పకడ్బంది చర్యలు చేపట్టింది.




