ఆడపిల్ల బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితులు మళ్లీ ముంచుకొస్తున్నాయి. అర్ధరాత్రి కాదు కదా.. కనీసం పసిబిడ్డతో పట్టపగలు రోడ్డుపై నడిచి వెళ్లేందుకు సైతం స్వేచ్ఛ లేని దుస్థితి ఎదురవుతోంది. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన వరుస ఘటనలు.. హైదరాబాద్లో మహిళలు, యువతుల సెక్యూరిటీపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ఓ మహిళ పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించిన ఒక కీచకుడిని పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు.
ఓవైపు… కాస్మోపాలిటన్ సిటీగా ఉన్న హైదరాబాద్.. విశ్వనగరంగా మారుతోంది. అదే సమయంలో నేరాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. పట్టపగలే మర్డర్స్, కిడ్నాపులు, దోపిడీలతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అటు రోడ్లపై పోకిరీలకు కూడా కొదవలేదు. మహిళలు, యువతులను టార్గెట్గా చేసుకుని పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లూ రాత్రి పూట మహిళలు, యువతుల వెంటపడే పోకిరీలు.. తాజాగా పట్టపగలు కూడా పోకిరీ చేష్టలకు దిగుతున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరిగిన రెండు ఘటనలే ఇందుకు ఉదాహరణ.
నార్సింగిలోని రోడ్ నం. 4లో మధ్యాహ్నం వేళ కూతురును ఎత్తుకుని వెళ్తున్న ఓ మహిళతో యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. నక్కినక్కి వెనక నుంచి వచ్చి.. ఆ మహిళ డ్రెస్ను పైకెత్తాడు. ఈ హఠాత్పరిణామంతో నివ్వెరపోయిన మహిళ గట్టిగా అరిచింది. దీంతో నిందితుడు పారిపోయాడు.
ఇదంతా అక్కడే ఓ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. కొందరు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు. బాధిత మహిళను గుర్తించి ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేశారు. మొత్తంగా 4 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. కేవలం 5 రోజుల్లోనే సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితుడి ఆచూకీ కనిపెట్టి సంకెళ్లు వేశారు. పోలీసుల విచారణలో నిందితుడిని పుప్పాలగూడకు చెందిన వడ్డే నాగరాజుగా గుర్తించారు. ఈ కామాంధుడికి తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు. ఇంకో వ్యక్తి ఇలాంటి ఘటనలు చేయాలంటే వణుకు పుట్టేలా చేశారు. ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఇటీవలే ఇలాంటి ఘటన నార్సింగి సైకిల్ ట్రాక్పై జరిగింది. సైకిల్ ట్రాక్పై మార్నింగ్ రన్నింగ్కు వెళ్లిన ఓ యువతికి ఛేదు అనుభవం ఎదురైంది. ఉదయం సుమారు 6.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని బాధితురాలు వెల్లడించింది. ట్రాక్పై రన్నింగ్ చేస్తున్న సమయంలో.. అందరూ చూస్తుండగానే గుర్తు తెలియని వ్యక్తి అసభ్య చేష్టలకు పాల్పడ్డాడని తెలిపింది. ఘటనను వీడియోగా చిత్రీకరించేందుకు ఆమె ప్రయత్నించినప్పటికీ, కెమెరా ఆన్ చేసేలోపే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడని చెప్పింది.
ఆ తర్వాత తన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న యువతి.. మహిళల దుస్తులపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చింది. తాను వేసుకున్నది సాధారణ స్పోర్ట్స్ డ్రెస్సే కదా… అందులో తప్పేముందని ఆమె ప్రశ్నించింది. సమస్య దుస్తుల్లో కాదని.. పురుషుల మనస్తత్వంలో ఉందని స్పష్టం చేసింది.
ఆమె వీడియోలో మరో ఆందోళనకర అంశాన్ని కూడా ప్రస్తావించింది. కేవలం యువకులే కాదు, ఆటోలు, బైక్లపై వెళ్లే వాళ్లు.. 55 ఏళ్లు పైబడిన వ్యక్తులు కూడా తప్పుడు ఉద్దేశ్యంతో చూస్తున్నారని ఆమె వాపోయింది. ఈ తరహా అనుభవాల వల్ల సూర్యోదయం తర్వాత కూడా బయటకు వెళ్లాలంటే భయం వేస్తోందని తెలిపింది. రన్నింగ్ డ్రెస్సులో ఆటో లేదా బైక్ ఎక్కినా సేఫ్గా అనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
హైదరాబాద్లోని సైకిల్ ట్రాక్లు, పార్కులు వంటి ప్రదేశాల్లో పోలీస్ గస్తీ పెంచాలని, వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా వ్యాయామం చేసుకునే వాతావరణం కల్పించడం అధికారుల బాధ్యత అని పలువురు అభిప్రాయపడుతున్నారు.




