జనం అత్యాశనే వారికి పెట్టుబడి.. అదే వారి ఆయుధం.. తక్కువ ధరకు బంగారం వస్తుందన్న జనం ఆశను.. కాదు.. కాదు.. అత్యాశను సొమ్ము చేసుకున్నారు ఇద్దరు కేటుగాళ్లు. చక్కగా సాధువుల్లా తయారై ఊరి జనాన్ని 9 నెలల పాటు నమ్మించారు. వన్ ఫైన్ మార్నింగ్.. భారీగా డబ్బు తీసుకుని జంప్ అయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లిలో జరిగింది. డబ్బు పోగొట్టుకున్న బాధితులు ఇప్పుడు లబోదిబోమంటూ పోలీసుల ఆశ్రయించారు.
ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న వారి పేర్లు బోగా లక్ష్మీనారాయణ, సాయి కుమార్. భోగా లక్ష్మీనారాయణ స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా నంద్యాల. కామేపల్లి మండలం భాసిత నగర్కు చెందిన సాయికుమార్తో కలిసి కెప్టెన్ బంజరలో మంచి చెడు కోసం పూజలు నిర్వహిస్తామని ఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్ బంజరలో కొంతమంది అయ్యప్ప స్వామి మాల వేశారు. బోగా లక్ష్మీనారాయణ, సాయికుమార్ కూడా మాలవేసి ఆ గ్రామంలో పూజలు నిర్వహించారు. గత తొమ్మిది నెలలుగా కెప్టెన్ బంజర, బాసిత్ నగర్ గ్రామాలలో అయ్యప్ప స్వామి పూజలతో పాటు, ముత్యాలమ్మ జాతరను భోగ లక్ష్మీనారాయణ స్వామి సొంత ఖర్చుతో నిర్వహించాడు.
ఇదే సమయంలో కామేపల్లి మండలంలోని లింగాల క్రాస్ రోడ్ వద్ద కోట మైసమ్మకు గుడి కట్టిస్తానని స్థలాన్ని కూడా కొన్నాడు బోగా లక్ష్మీనారాయణ. ఏడు లక్షల విలువలు చేసే స్థలాన్ని కొని నాలుగు లక్షల రూపాయలు కూడా చెల్లించారు. దీంతో ప్రజలు ఇతడు ఏది చెప్పినా నమ్మారు. ప్రజలలో ఒక నమ్మకం కలిగించిన తర్వాత బిస్కెట్ బంగారం తక్కువ ధరకు ఇస్తానని నమ్మించాడు.
గత తొమ్మిది నెలలుగా తమ గ్రామంలో నమ్మకం ఉంటూ అనేక పూజలు పండుగ కార్యక్రమంలో నిర్వహించినందున లక్ష్మీనారాయణ మాటలను నమ్మారు. తక్కువ ధరకు వస్తుందంటే ఆశతో లక్ష్మీనారాయణకు లక్షల రూపాయలు చెల్లించారు. కెప్టెన్ బంజర, బాసిత్ నగర్ గ్రామాలలోఅధికారికంగా 50 లక్షలు అంచనా తేలింది. కానీ గ్రామస్తులు కోటి రూపాయలు దాకా వసూలు చేశారని చెబుతున్నారు. అయితే ప్రజల నుంచి డబ్బు ముట్టగానే భోగా లక్ష్మీనారాయణతో పాటు సాయి కుమార్ కూడా అడ్రస్ లేరు. తమకు జరిగిన మోసంపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.




