AP High Court: విశాఖపట్నంలోని రుషికొండ భవనాల అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. భవనాల వినియోగంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోరాదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రస్తుతం భవనాల వినియోగానికి సంబంధించి కేవలం ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్’ ప్రక్రియ మాత్రమే కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. సీఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన భవనాల వినియోగాన్ని ప్రశ్నిస్తూ విశాఖకు చెందిన జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ప్రక్రియపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను చీఫ్ జస్టిస్ ధర్మాసనం తిరస్కరించింది. తదుపరి విచారణలో కేసుకు సంబంధించిన అంశాలపై కోర్టు పరిశీలన కొనసాగనుంది. కాగా, గత ప్రభుత్వ హయాంలో రుషికొండ భవనాలను నిర్మించగా.. విపక్షాలు పెద్దస్థాయిలో విమర్శలు గుప్పించాయి.. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆ భవనాల వినియోగంపై నిర్ణయం ఇంకా తీసుకోని విషయం విదితమే..




