Sajjala Ramakrishna Reddy: అమరావతిలో వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పేదల ప్రాణాలను కాపాడడమే కాకుండా, దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. వైఎస్సార్ కారణంగానే అనేక మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఇంజనీర్లు, వైద్యులుగా ఎదిగారని ఆయన తెలిపారు.
ఇక, వైఎస్సార్ భౌతికంగా లేకపోయినా, ఆయన వారసత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థంగా కొనసాగిస్తున్నారని సజ్జల అన్నారు. ప్రజల కోసం వైఎస్సార్ ఒక అడుగు వేస్తే, జగన్ రెండు అడుగులు ముందుకు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ జగన్ తన పట్టుదల, దార్శనికతతో ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారని చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన, అధికార కూటమి మోసపూరిత హామీలతో ప్రజలను నిరాశపరిచిందని ఆరోపించారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, కూటమి నాయకులు ప్రజల ముందుకు వెళ్లేందుకు కూడా వెనుకాడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, గతం కంటే మెరుగైన పాలనను అందిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.




