Abhishek Banerjee: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అతడిపై పలు కేసుల్లో విచారణ జరుగుతోంది. తాజాగా బెంగాల్ సీఐడీ అతడిని విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చేందుకు ఆయన నివాసానికి వెళ్లింది. శనివారం మధ్యాహ్నం అభిషేక్ కార్యాలయం అయిన ‘‘శాంతినికేతన్’’కు చేరుకుని నోటీసులు ఇవ్వాలని అధికారులు ప్రయత్నించారు. సోమవారం సీఐడీ కార్యాలయం భవానీ భవన్కు విచారణ కోసం రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలో అభిషేక్ అక్కడ లేకపోవడంతో నోటీసులు తీసుకోలేదు.
మరో సీఐడీ బృందం కాళీఘాట్లోని మరో ఆఫీసులోకి వెళ్లి అక్కడ అభిషేక్ బెనర్జీకి నోటీసలు అందించారు. ఈ వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ.. తాను ఇంకా నోటీసును పూర్తిగా చదవలేదని చెప్పారు. న్యాయవాదులతో చర్చించిన తర్వాత అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. తనపై కేంద్ర సంస్థలు, రాష్ట్రపోలీసులు, కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
‘‘వారు ఏమి చేయాలనుకుంటే అది చేసుకోనివ్వండి. వారికి నచ్చినట్లు వారు ప్రవర్తించవచ్చు. ఇంతకుముందు కేవలం ED, CBI మాత్రమే ఉండేవి, ఇప్పుడు వాటితో పాటు బెంగాల్ పోలీసులు, కోల్కతా పోలీసులు , KMC (కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్) కూడా జతకలిశాయి. ఇంతకుముందు 2–3 దర్యాప్తు సంస్థలు ఉండేవి, ఇప్పుడు ఆ సంఖ్య 5కి చేరింది. నాపై 5–6 సంస్థలను ఉసిగొలిపి, బ్లాక్మెయిల్ చేయడం ద్వారా నన్ను భయపెట్టి లొంగదీసుకోవచ్చని వారు భావిస్తున్నారు. నేను అలాంటి వ్యక్తిని కాదు. మీరు నా గొంతు కోసినా సరే, మీకు నచ్చినట్లు ఏది చేసినా సరే… నన్ను లొంగదీసుకోవాలంటే ఏడు జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. నేను దేశద్రోహిని కాదు’’ అని ఆయన అన్నారు.
సంతకాల ఫోర్జరీ కేసు ఏంటి.?
టీఎంసీ ఓడిపోయిన తర్వాత, అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నేతగా సీనియర్ నేత సోవన్ దేబ్ చటర్జీ ఎంపిక లేకపై కొంతమంది ఎమ్మెల్యేల సంతకాలను వారి అనుమతది ల లేకుండా ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేలు కునాల్ ఘోష్, నయనా బందోపాధ్యాయలను సీఐడీ విచారించింది.




