West Bengal polls: పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. 142 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి గట్టి పట్టు ఉన్న ప్రాంతాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.
ఫల్తా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పేరు కనిపించకుండా, కమలం గుర్తు కనిపించకుండా ఈవీఎంలపై టేపు అంటించి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బీజేపీ ఐటీ చీఫ్, బెంగాల్ కో-ఇన్చార్జ్ అమిత్ మాలవ్య మాట్లాడుతూ, ఈ ఘటన బూత్ నంబర్ 144లో జరిగినట్లు నివేదించబడిందని, అలాగే బూత్లు 170 ,189 కూడా ఇదే విధంగా ప్రభావితమయ్యాయని ఆరోపించారు.
Read Also: Venkatesh: మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
ఈ ఘటనను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి బూత్లలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈవీఎంలపై నలుపు లేదా తెలుపు టేపు కనిపించి ప్రతీ పోలింగ్ కేంద్రంలతో తిరిగి పోలింగ్ నిర్వహిస్తామని పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో బూత్లలో ఇలా టేపు అంటించి ఉంచినట్లు తేలింతే, మొత్తం నియోజక వర్గానికి పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు.
ఫల్తా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పేరు ఈవీఎంపై కనిపించకుండా చేశారని బీజేపీ ఫిర్యాదు చేయడంతో గందరగోళం మొదలైంది. దీనిపై విచారణకు ఈసీ ఆదేశించింది. ఇదిలా ఉంటే, ఫల్తా నియోజకవర్గం తృణమూల్ కీలక నేత జహంగీర్ ఖాన్ సొంత నియోజకవర్గం. ఇటీవల, జహంగీర్ ఖాన్, ఎన్నికల అబ్జర్వర్గా వచ్చిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. జహంగీర్ ఖాన్ మనుషులు ప్రజల్ని భయాందోళకు గురిచేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని అజయ్ పాల్ శర్మ వార్నింగ్ ఇవ్వడం వైరల్గా మారింది.




