Uday Krishna Reddy: హైదరాబాద్లో ఉన్న జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడన్న ఘటనలో ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ట్రైనీ IPS, 30 ఏళ్ల వివాహిత ఇచ్చిన ఫిర్యాదులో.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెకు అసభ్యకర మెసేజ్లు పంపడమే కాకుండా.. గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకుని గొంతు నులమడం, మెడపై కత్తిపెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడని పేర్కొంది. అలాగే బాధితురాలికి సంబంధించిన ప్రైవేట్ వీడియోను రికార్డ్ చేసి ఆమె భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేశాడని కూడా తెలిపారు.
అయితే తాజాగా భారీ ట్విస్ట్ బయటికి వచ్చింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. గుర్తుతెలియని ద్రవ పదార్థాన్ని సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం ప్రకారం.. గురువారం తెల్లవారుజామున ఉదయ్ కృష్ణారెడ్డి తన సోదరుడి ఇంటికి వచ్చి గుర్తుతెలియని లిక్విడ్ను తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన పరిస్థితిని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎస్సార్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.




