మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక సంభాషణ జరిగింది. ఇద్దరి మధ్య 90 నిమిషాల పాటు ఫోన్ కాల్ సంభాషణ జరిగినట్లుగా క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషాకోవ్ తెలిపారు.
ప్రధానంగా ఇరాన్ పరిస్థితులు, పర్షియన్ గల్ఫ్ ఉద్రిక్తతలపై చర్చ జరిగినట్లుగా చెప్పారు. ఇక ఇరాన్పై కాల్పుల విరమణ కొనసాగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని పుతిన్ సమర్థించారని.. ఇది శాంతి చర్చలకు అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. అయితే మరొకసారి అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలక దిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని పుతిన్ హెచ్చరించారు. ఇది కేవలం ఇరాన్కే పరిమితం కాదని.. యావత్తు ప్రపంచానికే నష్టం కలిగిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఉద్రిక్తతల పరిష్కారానికి రష్యా పూర్తి స్థాయిలో దౌత్య సహకారం అందిస్తుందని పుతిన్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధంపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. 2022లో ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతుండగా.. ప్రస్తుత పరిస్థితులపై ట్రంప్కు పుతిన్ వివరించారు. రష్యా సైన్యం వ్యూహాత్మక ఆధిక్యంలో ఉందని తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాయకత్వంపై ఇద్దరు నాయకులు విమర్శలు చేసినట్లు సమాచారం. యూరోప్ మద్దతుతో యుద్ధాన్ని పొడిగిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
మే 9న జరిగే విక్టరీ డే సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమణకు సిద్ధమని పుతిన్ తెలిపారు. ఈ ప్రతిపాదనకు ట్రంప్ కూడా మద్దతు తెలిపినట్లు సమాచారం. విక్టరీ డే ప్రతి సంవత్సరం మే 9న జరుపుకుంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయం సాధించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మాస్కోలో భారీ పరేడ్ నిర్వహించనున్నారు.




