ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ…తెలంగాణకు వచ్చిన ఉద్దేశం ఏంటి ? అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చి రాజకీయ ప్రసంగాలు చేయడం కరెక్టేనా ? తెలంగాణ ప్రజలతో పాటు బీజేపీ కార్యకర్తలను అయోమయంలో పడేశారా ? పథకాలు ప్రారంభోత్సవంలో రాజకీయ ప్రసంగాలు చేసి…అబాసు పాలయ్యారా ?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన వచ్చిన కారణం ఏంటి…? చేసిన ప్రసంగాలు ఏంటన్న జనం మాట్లాడుకుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన ప్రధాని…రాజకీయాలు మాట్లాడవచ్చా ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో…ప్రధాని ఏదేదో మాట్లాడేశారు. సందర్భం లేకపోయినా…అనవసర విషయాలను ప్రస్తావించడంపై జనం సెటైర్లు వేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు వచ్చినపుడు రాజకీయ పరిణతితో వ్యవహరించాల్సిన మోడీ…పొలిటికల్ కామెంట్స్ చేయడం ఎంతవరకు సమంజసం అని నిలదీస్తున్నారు. అసలు ప్రధాని మోడీ…తెలంగాణకు వచ్చిన కారణమేంటి ? చేసిన ప్రసంగాలు ఏంటి ? ఇప్పుడిదే తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ…హైదరాబాద్ హైటెక్సిటీలోని హెచ్ఐసీసీ నుంచి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్గా చేశారు. అయితే పథకాలు ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని…అనవసర ప్రసంగాలు చేయడాన్ని ప్రజలు, బీజేపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారిక కార్యక్రమం కావడంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి…నిధుల గురించి వేదికపైనే మోడీకి విజ్ఞప్తి చేశారు. పదేళ్లుగా గుజరాత్కే ఎక్కువ నిధులు ఇచ్చారని రేవంత్రెడ్డి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మోడీ…సైబరాబాద్ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని కితాబిచ్చారు. అనేక పెద్ద ప్రాజెక్టులు ఇక్కడ ప్రాణం పోసుకుంటున్నాయని చెప్పడం వరకు కరెక్టే. సైబరాబాద్ అతి పెద్ద ఉపాధి కేంద్రంగా మారిందన్న మోడీ… సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఈవీ రంగాల్లో కీలక పాత్ర పోషించడంపై ప్రశంసలు కురిపించారు.
అక్కడ వరకు ఒకే. ఎవరికి ఇబ్బందులు లేవు. ఆ తర్వాతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఇరకాటంలో పెట్టేలా ప్రధాన మంత్రి మోడీ కామెంట్స్ చేశారు. అభివృద్ధి పథకాలు ప్రారంభోత్సవానికి వచ్చినపుడు వాటి మీదే దృష్టి పెట్టాలి. కానీ అధికారిక కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చేయడం ఏంటి ? ఇది ఎంత వరకు కరెక్ట్ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రాజకీయాలు మాట్లాడనని చెప్పడంతో…తానూ మాట్లాడను అంటూనే..పొలిటికల్ ప్రసంగాలు చేశారు. రేవంత్ రెడ్డి…నా మాట వింటున్నారా..? గతంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని మీరు గమనించాలని సూచించడం మంచిదే. గత పదేళ్లుగా గుజరాత్ అభివృద్ధికి ఎంత కేటాయించామో…తెలంగాణకూ అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం కరెక్టే. కానీ, అదే జరిగితే తెలంగాణకు వచ్చే నిధులు తగ్గుతాయంటూ…సీఎంకు సుతిమెత్తగా హెచ్చరికలు చేశారు. అప్పుడు మీరు మీ లక్ష్యాన్ని చేరుకోలేరు అంటూనే…గతంలో రైల్వే బడ్జెట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వెయ్యి కోట్లు కూడా వచ్చేవి కావు. రేవంత్రెడ్డి గారూ.. ఇది వింటున్నారా ? ఇప్పుడు ఒక్క తెలంగాణకే ఐదున్నర వేల కోట్లు కేటాయించామంటూ పొలిటికల్ కామెంట్స్ చేశారు.
ఉమ్మడి ఏపీలో రైల్వే బడ్జెట్లో వెయ్యి కోట్లు కూడా దక్కేవి కాదని క్లారిటీ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఒక్క తెలంగాణకే ఐదున్నర వేల కోట్లు కేటాయించామని ఘనంగా ప్రకటించుకోవచ్చు. ఇందులో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కేవలం తెలంగాణకే బడ్జెట్లో వేల కోట్లు ఇస్తున్నామని ఘనంగా చెప్పుకోవచ్చు. గతంలో కేంద్ర ప్రభుత్వం గుజరాత్కు ఎన్ని నిధులు ఇచ్చిందో.. అన్ని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూనే…సీఎం రేవంత్రెడ్డిని ఇరాకటంలో నెట్టేశారు మోడీ. అలా చేస్తే.. ప్రస్తుతం మీకు అందుతున్నది కాస్తా సగం అయిపోతుంది. మీరు ఎక్కడికి చేరుకోవాలని అనుకుంటున్నారో.. అక్కడికి చేరుకోలేరని బెదిరించారా ? లేదంటే వార్నింగ్ ఇస్తున్నారా ? అన్న చర్చ పొలిటికల్గా చర్చ జరుగుతోంది. మేరే సేహీ జుడో అంటూ మోడీ చెప్పారు.
గుజరాత్కు ఆనాడు ప్రత్యేకంగా వచ్చిందేమీ లేదని చెప్పడం కోసమే…ప్రధాని మోడీ నాతో కలవండి అన్నారా ? లేక నిజంగానే వేరే ఉద్దేశంతో అన్నారా… అనేదానిపై రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక పార్టీ…ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరో పార్టీ. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు భిన్నధృవాలు. కేంద్రంలో అయినా…రాష్ట్రంలో అయినా…తూర్పు పడమరలాంటివి. అలాంటపుడు నాతో చేతులు కలపండి…మీరు ఎక్కడికి చేరుకోవాలని అనుకుంటున్నారో అక్కడికి చేరలేరు అంటూ బహిరంగంగా ఎలా అంటారు మోడీగారు. అధికారిక కార్యక్రమంపై నాతో కలవండి అంటూ పరిణతి కలిగిన రాజకీయ నాయకుడిగా మాట్లాడవచ్చా ? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని రాజకీయంగా ఇరకాటంలో నెట్టడానికే అలా కామెంట్స్ చేశారా ? లేదంటే ఇంకేదైనా ఉద్ధేశం ఉందా ? రేవంత్రెడ్డి సరదాగా తీసుకోవాల్సి వచ్చింది తప్పా…ఏం అనలేని పరిస్థితిలో పడిపోయారు.
ప్రధాన మంత్రి మోడీ…రాష్ట్రానికి మేలు జరిగేలా ప్రకటనలు చేస్తారని తెలంగాణ ప్రజలు భావించారు. అయితే పొలిటికల్ కామెంట్లు చేయడంతో సభ ఉద్దేశం పక్కదోవ పట్టిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధాని వ్యాఖ్యలకు రేవంత్రెడ్డి ఇబ్బందుల్లో పడిపోయారు. ప్రధాని మోడీ ప్రజలు గొప్పగా ఊహించుకుంటారు. అలాంటి నేత సందర్భం లేకుండా…మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిన్న హెచ్ఐసీసీలో కార్యక్రమంలో నిన్న అదే జరిగింది. నరేంద్ర మోడీ…మూడోసారి ప్రధాన మంత్రిగా పని చేస్తున్నారు. అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు పని చేశారు. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా… పార్లమెంట్ సభ్యుడిగా, ప్రధాన మంత్రిగా అనుభవమున్న మోడీ…అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ ప్రసంగాలు చేయడం ఎంతవరకు కరెక్ట్. 40 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న ప్రధాని…ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా ? మోడీ కామెంట్స్పై అటు ప్రజల్లో…ఇటు బీజేపీ కార్యకర్తల్లో రకరకాల చర్చ జరుగుతోంది.
ప్రధాన మంత్రి మోడీ…పొదుపు ప్రసంగాలు ఇప్పుడెందుకు చేస్తున్నారు ? దక్షిణాది ప్రజలకు…పొదుపు గురించి తెలియదా ? కరవు, కరోనా నుంచి సౌతిండియా బయటపడలేదా ? పొదుపు గురించి ప్రధాని మోడీ పాఠాలు నేర్చుకోవాలా ? ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాల్సిన ప్రధాని…సంక్షోభం వస్తుందని ముందే జనాన్ని సిద్ధం చేస్తున్నారా ?
దక్షిణాది ప్రజలకు పొదుపు గురించి తెలిసినట్లు…దేశంలో ఎవరికి తెలియదు. ఆర్థిక సూత్రాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బోదించాల్సిన అవసరం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దాల్సిన మోడీ….నేనున్నాను అంటూ ఇవ్వాల్సిన ప్రధాని పొదుపు మంత్రం జపించడంపై జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాంటి కష్టాలు వచ్చినా…కరవులు వచ్చినా…సంక్షోభాలు వచ్చినా…నేనున్నాను అంటూ భరోసా ఇవ్వాలి. దేశ ప్రజల్లో ధైర్యం నింపాలి. ఆర్థిక వ్యవస్థ మందగించకుండా…దేశం సంక్షోభంలో కూరుకుపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. కానీ ఇవన్నీ చేయకుండా పొదుపు పాటించాలని చెప్పడం ఎంతవరకు సమంజసం. ప్రపంచంలోనే పెద్ద దేశానికి ప్రధాని ఉన్న మోడీ…ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా అన్న చర్చ జరుగుతోంది. సంక్షోభం వస్తుందని హెచ్చరిస్తున్నారా ? లేదంటే ముందుగానే మాంద్యానికి సిద్దం చేస్తున్నారా అన్న ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఇంటి పెద్దగా దేశ ప్రజలకు భరోసా ఇవ్వాలి. కానీ ప్రధాని చేసిన ప్రసంగం నవ్వుల పాలయింది.
MODI ON PODUPU
కొవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో సమస్యలు వచ్చాయి. అమెరికా-ఇరాన్ వార్తో పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. యుద్ధాల వల్ల పొరుగు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీర్ఘకాలంలో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని మనం తగ్గించుకోవాలని మోడీ చెప్పారు. రైల్వే రంగంలో డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తున్నామని, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య ఇంకా పెరగాలని సూచించడం మంచిదే. సమీప భవిష్యత్లో పెట్రోల్, డీజిల్ అవసరం మనకు భారీగా తగ్గుతుందని, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గితే విదేశీమారక ద్రవ్యం మిగులుతుందని భరోసా ఇవ్వడం మంచి సంకేతమే. పెట్రోల్, డీజిల్ విషయంలో దుబారా తగ్గించుకోవాలని సూచించారు. చాలా దేశాల్లో యూరియా బస్తా ధర రూ.3 వేలు ఉందని, భారత్లో మాత్రమే యూరియా బస్తా రూ.300 లోపు ఉందని వెల్లడించారు. ప్రజలు పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని చెబుతున్న మోడీ…ఆయన కాన్వాయ్లో మాత్రం భారీగా వాహనాలు ఎందుకు వినియోగిస్తున్నారు. సోమనాథ్టెంపుల్కు వెళ్లినపుడు హెలికాప్టర్లతో హడావిడి ఎందుకు జనం ప్రశ్నిస్తున్నారు.
అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయని…బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని ప్రధాని హెచ్చరించడంపైన జనం ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. భారతీయ మహిళలు పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనుగోళ్లు చేస్తారు. బంగారం దిగుమతులు తగ్గితే.. విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుంది. విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ మ్యారేజ్లను తగ్గించుకోవాలని చెప్పడం సరైంది కాదు. బంగారం కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేద్దామని ప్రధాని పిలుపునిచ్చారు.
బంగారం దిగుమతులు తగ్గితే విదేశీమారక ద్రవ్యం పెరుగుతుందని… విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ మ్యారేజ్లను తగ్గించుకోవాలని ఎలా చెబుతారు. ఈ ఏడాది ఇళ్లలో ఫంక్షన్లు జరిగినా…పెళ్లిళ్లకు బంగారం కొనుగోలు చేయవద్దా ? ఇలాంటి ఐడియా ఎవరిచ్చారు ? అసలు ఇండియాలో ఇలాంటి వాటిని జనం పట్టించుకుంటారా ? బంగారం కొనుగోలుచేయకుండా ఎవరైనా ఆపగలరా ? కరువులు వచ్చినా…సంక్షోభాలు వచ్చినా…భారతీయులు బంగారాన్ని కొనుగోలు చేయడం ఆపలేదు. అలాంటిది ఇప్పుడు గోల్డ్ కొనవద్దంటే జనం వింటారా ? అది సాధ్యమవుతుందా ?
వంట నూనెను కూడా మనం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ప్రధాని చెప్పడం వరకు ఒకే…దీనికి విదేశాల నుంచి దిగుమతులు పెంచడానికి చర్యలు తీసుకుంటే సరిపోతుంది. లేదంటే వంట నూనెలో స్వయం సమృద్ధి సాధిస్తే…ఇంకా మంచిది. ఎరువుల వినియోగం తగ్గించి భూసారాన్ని కాపాడితే రైతులు పండింటే పంటలు బాగు పడుతాయ కదా. మనం ఇంట్లో వాడే వస్తువులను ఒకసారి పరిశీలించాలని సూచించడం…నిత్యావసర వస్తువులన్నీ విదేశాల నుంచి వచ్చినవేనని, అన్నింటికి దిగుమతులపైనే ఆధారపడితే దేశాభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మన నిత్యావసర వస్తువుల్లో స్వదేశీ వస్తువులే ఎక్కువగా ఉండాలని పిలుపునిచ్చారు. స్వదేశీ వస్తువులనే వినియోగిస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. స్వదేశీ అనేది కేవలం బీజేపీ నినాదం కాదని ఇది దేశ విధానని స్పష్టం చేశారు.
వ్యక్తిగత వాహనాలు తగ్గించి.. ప్రజారవాణా వినియోగం పెంచాలని విజ్ఞప్తి చేశారు. భారత దేశంలో ఉన్న జనాభా మొత్తం ప్రజా రవాణాకు మొగ్గు చూపితే…వాహనాలు సరిపోతాయా ? ఇది ఆలోచించాల్సిన అవసరం లేదా ? మధ్యతరగతి ప్రజలు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని మోడీ విజ్ఞప్తి చేయడం మంచిదే. ప్రజలకు పొదుపు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో కష్టాలు, సంక్షోభాలను చూసిన జనం…మోడీ మాటలను నమ్ముతారన్న గ్యారెంటీ లేదు. కష్టాలు వచ్చినా నేను చూసుకుంటాను…మీరేం చింతించకండి అంటూ భరోసా ఇవ్వకుండా ప్రజలకు పాఠాలు చెబితే వింటారా ? పొదుపు గురించి ప్రత్యేకంగా పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రధాని మోడీ పరధ్యానంలో ఉన్నారా ? లేదంటే బెంగాల్లో గెలుపుతో…ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారా ? మోడీ వచ్చిన కార్యక్రమానికి…చేసిన మాటలకు పొంతన ఉందా ? అసలు ప్రధాని మోడీ తెలంగాణకు ఎందుకు వచ్చారు ? ఏం మాట్లాడారు ? ఏదో మాట్లాడబోయి…ఇంకేవో కామెంట్లు చేశారా ?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…తెలంగాణ టూర్ పూర్తిగా అధికారికమే. అయితే చేసిన కామెంట్లు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో…ప్రధాని మోడీ పరధ్యానంలో పడిపోయారని జనం చర్చించుకుంటున్నారు. ఆ ఎన్నికల గెలుపు నుంచి ఇంకా బయట పడలేదని…అందుకే సంబంధం లేని కామెంట్లు చేశారని జనం మాట్లాడుకుంటున్నారు. ప్రధాని ప్రసంగం మొత్తం దారి తప్పిందని జనంతో పాటు బీజేపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అసలు ప్రధాని మోడీ వచ్చిన కార్యక్రమం ఏంటి ? పొలిటికల్ కామెంట్లు ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్నారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ప్రపంచ ముడి చమురు పోకడలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్లు, ఇంధన ధరలను సమతుల్యం చేయడంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశ ప్రజలు పొదుపు మంత్రం పాటిస్తారా ? పెట్రోల్, బంగారం వాడకాన్ని తగ్గిస్తే దేశం 45 బిలియన్ డాలర్లు…అంటే మన కరెన్సీలో దాదాపు 4లక్షల 28వేల కోట్లు సేవ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా 4 రంగాల్లో స్వల్ప మార్పులు చేస్తేనే ఈ అద్భుతం సాధ్యమవుతుంది. క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో కేవలం 10 శాతం తగ్గింపు పాటిస్తేనే దాదాపు లక్షా 28,480 కోట్లు మిగులుతాయి. అలాగే రికార్డు స్థాయిలో ఉన్న బంగారం దిగుమతులను 10 శాతం తగ్గిస్తే మరో 68,520 కోట్ల దేశం దాటవని తేలింది.
అమెరికా-ఇరాన్ ప్రతిష్టంభన మధ్య ముడి చమురు ధరలు పెరగడంతో, చాలాకాలంగా వాయిదా పడుతున్న ఇంధన ధరల పెంపునకు ఇక నాంది పలకవచ్చని అంచనా. ముఖ్యంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, వినియోగదారులపై భారం పడకుండా చమురు సంస్థలు తక్కువ ధరకే ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు రోజుకు సుమారు 1,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. త్రైమాసికంలో 2 లక్షల కోట్ల వరకు వసూళ్లలో లోటు ఉంటుందని, సుమారు 1 లక్ష కోట్ల నష్టాలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం రిటైల్ ఇంధనంపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం వల్ల ఒక నెలలో 14,000 కోట్ల ఆదాయ నష్టాలను చవిచూస్తోంది.
ప్రధాని మోడీ చెప్పినట్లు…రసాయన ఎరువుల వాడకాన్ని 50 శాతం తగ్గిస్తారా అన్నది ప్రశ్నార్థకమే. రైతన్నలు దీనిని ఫాలో అయితే ఎరువుల దిగుమతులపై ఖర్చులు సుమారు 69, 470 కోట్లు ఆదా అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మధ్యతరగతిలో పెరుగుతున్న విదేశీ విహారయాత్రలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి వాటిని ఏడాది పాటు వాయిదా వేసుకుంటే.. మరో లక్షా 50వేల 360 కోట్ల విదేశీ కరెన్సీని ఇండియా సేవ్ చేసుకోవచ్చని తేలింది. దీనికి తోడు వంటనూనె వాడకాన్ని ప్రజలు 10 శాతం తగ్గిస్తే మరో రూ.18వేల 550 కోట్లు ఇండియా దాటి బయటకు పోవు. ఒకవేళ దేశ ప్రజలు మోడీ పిలుపు మేరకు ఏడాది పాటు బంగారం కొనడం పూర్తిగా ఆపేస్తే.. ఆదా అయ్యే మొత్తం ఊహకందని రీతిలో ఉంటుంది. కేవలం గోల్డ్ దిగుమతుల ఆగితే ఇండియాకు ఒక్క ఏడాదిలో ఏకంగా 6,85, 200 కోట్లు ఆదా అవుతాయని లెక్కలు చెబుతున్నాయి. ప్రధాని సూచించిన అన్ని జాగ్రత్తలను లెక్కలోకి తీసుకుంటే మొత్తం 12 లక్షల కోట్ల రూపాయలు సేవ్ అవుతాయని తేలింది. అదే బంగారం దిగుమతులు కనీసం 10 శాతం తగ్గించినా రూ.68వేల 400 కోట్లు ఆదా అవుతాయి. దీంతో టోటల్ సేవింగ్స్ రూ. 4లక్షల 28వేల కోట్లకు చేరుతాయ్.
ప్రస్తుతం డాలరుతో రూపాయి విలువ 95.17 కు పడిపోవడం, విదేశీ మారక నిల్వలు వారం వ్యవధిలోనే 74, 230 కోట్లు ఆవిరి అవటంతో దేశ ఆర్థిక భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అమెరికా-ఇరాన్ యుద్ధం ముదురుతున్న వేళ.. ప్రతి భారతీయుడు పాటించే పొదుపు మంత్రం దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడే ఒక గొప్ప ఆయుధంగా మారుతుందని ఆర్థిక వేత్తలు అంటున్నారు. లక్షల కోట్ల రూపాయల ఆదా జరిగితే.. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మళ్లీ కోలుకోవడానికి బలమైన పునాది పడుతుందని వారు చెబుతున్నారు. లోపభూయిష్టమైన విదేశాంగ విధానాన్ని కప్పిపుచ్చుకోడానికే…మోడీ పొదుపు మంత్రం జపిస్తున్నారని విమక్షాలు విరుచుకుపడుతున్నాయి. మోడీ ఫారిన్ పాలసీని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తోంది. బంగారం కొనొద్దు, విమానాల్లో ప్రయాణం చేయొద్దని ప్రజలకు పిలుపునివ్వడం మోడీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కాంగ్రెస్ వాదిస్తోంది. విదేశాంగ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, ప్రతిపక్షాల సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తోంది.




