ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్కు చేరుతున్న వేళ, ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మరో రసవత్తర పోరాటానికి సిద్ధమైంది. నేడు రాత్రి 7:30 గంటలకు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉన్న పంజాబ్ కింగ్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే హైదరాబాద్కి ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ సీజన్లో ఇప్పటికే 10 మ్యాచ్లు ఆడి 6 విజయాలతో మూడో స్థానంలో ఉన్న ఆరెంజ్ ఆర్మీ, నేటి మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లాలని పట్టుదలతో ఉంది. పంజాబ్తో జరిగిన గత మ్యాచ్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటూ, ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకోవడమే లక్ష్యంగా SRH బరిలోకి దిగుతోంది.
సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ విభాగం ఈ సీజన్లో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జోడీ ఇచ్చే మెరుపు ఆరంభాలపైనే జట్టు ఆశలు పెట్టుకుంది. వీరితో పాటు హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా వంటి హార్డ్ హిట్టర్లు ఉండటం జట్టుకు పెద్ద బలం. గత మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ వైఫల్యం కారణంగా భారీ స్కోరు సాధించలేకపోయిన SRH, ఈసారి ఆ పొరపాట్లను సరిదిద్దుకోవాలని చూస్తోంది. జ్వరంతో గత మ్యాచ్కు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి ఈ మ్యాచ్లో తిరిగి వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని బౌలింగ్ విభాగం కూడా యువ బౌలర్ల రాకతో బలోపేతమైంది.
పంజాబ్ సవాల్..
మరోవైపు పంజాబ్ కింగ్స్ 9 మ్యాచ్ల్లో 13 పాయింట్లతో టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో వరుసగా ఆరు విజయాలు సాధించిన పంజాబ్, గత రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి కాస్త ఒత్తిడిలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచి మళ్లీ ఫామ్లోకి రావాలని వారు భావిస్తున్నారు. ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. క్రికెట్ ఉత్సాహం నడుమ మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు స్టేడియం వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. యువతను లక్ష్యంగా చేసుకుని “Say No to Drugs” అనే నినాదంతో భారీ యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. మ్యాచ్ చూడటానికి వచ్చే ప్రేక్షకులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై ప్లకార్డులు, పాంప్లెట్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. స్టేడియం పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ పోరాటంలో హైదరాబాద్ గెలిచి టేబుల్ టాపర్గా నిలుస్తుందో లేక పంజాబ్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటుందో వేచి చూడాలి.




