Punjab Blasts: పంజాబ్ బాంబుల మోతతో దద్దరిల్లింది. మంగళవారం రాత్రి గంటల వ్యవధిలోనే జరిగిన రెండు వేర్వేరు పేలుడు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. జలంధర్, అమృత్సర్లలోని రక్షణ రంగ సంస్థల (Defence Establishments) సమీపంలోనే పేలుడు సంభవించడం భద్రతాపరమైన ఆందోళనలను పెంచింది. మొదటి ఘటన రాత్రి 8 గంటల సమయంలో జలంధర్లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ప్రధాన కార్యాలయం గేటు వెలుపల జరిగింది. అక్కడ పార్క్ చేసి ఉన్న ఒక స్కూటర్ (యాక్టివా) అకస్మాత్తుగా పేలింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే, దాదాపు కిలోమీటరు దూరం వరకు పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. మంటల ధాటికి సమీపంలోని కారు అద్దాలు, దుకాణాల కిటికీలు ధ్వంసమయ్యాయి. స్కూటర్ యజమాని గుర్ప్రీత్ సింగ్ ఫుడ్ తాను డెలివరీ ఇచ్చేందుకు వచ్చి పార్క్ చేయగా ఈ ఘటన జరిగిందని తెలిపాడు. పోలీసులు దీనిని తొలుత అగ్నిప్రమాదంగా భావిస్తున్నప్పటికీ, పేలుడు కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో పేలుడుకు తామే బాధ్యులమని ఖలిస్తానీ గ్రూపు ప్రకటించింది.
రెండో ఘటన రాత్రి 11 గంటల సమయంలో అమృత్సర్లోని ఖాసా ఆర్మీ క్యాంప్ వెలుపల జరిగింది. అట్టారీ రోడ్డులో ఉన్న ఆర్మీ క్యాంప్ ప్రహరీ గోడ వద్ద ఓ పేలుడు సంభవించింది. ఎవరో దుండగులు గోడ వైపు పేలుడు పదార్థాన్ని విసిరినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో కొన్ని లోహపు ముక్కలు గోడకు గుచ్చుకుని ఉండటాన్ని గమనించిన పోలీసులు, ముసుగు ధరించిన వ్యక్తులు ఈ దాడికి పాల్పడి పరారైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అదృష్టవశాత్తూ ఈ రెండు ఘటనల్లోనూ ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. మరోవైపు, ఈ పరిణామాలు పంజాబ్లో రాజకీయ దుమారాన్ని రేపాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ పన్నుతున్న కుట్రలో భాగమే ఈ పేలుళ్లని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపించారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించి ఓట్లు పొందాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. కాగా, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్, అకాలీదళ్ నేతలు ఆరోపించారు. జలంధర్ పేలుడు ఘటనలో గాయపడిన బీఎస్ఎఫ్ జవాన్ (కొన్ని నివేదికల ప్రకారం) త్వరగా కోలుకోవాలని ప్రతాప్ సింగ్ బజ్వా ఆకాంక్షించారు. సరిహద్దు రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.




