ముంబైలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శనివారం రాత్రి బిర్యానీ విందు ఆరగించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు, మరుసటి రోజు ఉదయానికే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ఫుడ్ పాయిజన్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆ రాత్రి ఏం జరిగింది?
ముంబైకి చెందిన అబ్దుల్లా (40) అనే మొబైల్ వ్యాపారి, తన భార్య నస్రీన్ (35), కుమార్తెలు ఆయేషా (16), జైనాబ్ (13)లతో కలిసి శనివారం రాత్రి 10:30 గంటల సమయంలో బంధువులతో కలిసి బిర్యానీ విందులో పాల్గొన్నారు. భోజనం ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత, రాత్రి ఒంటి గంట సమయంలో వారంతా పుచ్చకాయను తిన్నారు. తెల్లవారుజామున 5 గంటల వరకు వారి ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత ఒక్కసారిగా అందరికీ వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో వారిని వెంటనే జేజే ఆసుపత్రికి తరలించారు.
ఒక్కొక్కరుగా మృతి..
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 10:15 గంటలకు చిన్న కుమార్తె జైనాబ్ మొదట మరణించింది. కొద్దిసేపటికే తల్లి నస్రీన్, పెద్ద కుమార్తె ఆయేషా కూడా కన్నుమూశారు. ఇక రాత్రి 10:30 గంటల సమయంలో తండ్రి అబ్దుల్లా కూడా ప్రాణాలు విడిచారు. కేవలం 12 గంటల వ్యవధిలోనే ఒక నిండు కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది.
విచారణలో పోలీసులు..
ఈ మరణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారు తిన్న పుచ్చకాయ ముక్కలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. పుచ్చకాయలో ఏదైనా విషపూరిత రసాయనాలు కలిశాయా? లేదా ఇతర ఆహార పదార్థాల వల్ల ఇబ్బంది కలిగిందా? అనే కోణంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు విచారిస్తున్నారు.
మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించారు. వారి శరీరంలోని అవయవాల నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అనేది మైక్రోబయాలజీ విభాగం పరిశీలిస్తోంది. వైద్యులు చెబుతున్న దాని ప్రకారం… వారు ఆసుపత్రికి వచ్చే సమయానికే తీవ్రమైన నీరసంతో, డీహైడ్రేషన్తో ఉన్నారు. తుది నివేదిక వస్తే తప్ప ఈ నలుగురి మరణానికి అసలు కారణం ఏమిటనేది స్పష్టంగా తెలియదు. ఈ ఘటనతో ముంబై ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బయట ఆహారం తినేటప్పుడు, ముఖ్యంగా పండ్లు వంటివి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




