హైలెవల్ బ్రిడ్జి చుట్టూ హైటెన్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? శంకుస్థాపన రాయి పడీ పడగానే…. పొలిటికల్ పిడకల వేట మొదలైపోయిందా? కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు పావులు కదుపుతున్నాయా? ప్రస్తుతం పేలుతున్న మాటల తూటాలు ఇక్కడితో ఆగుతాయా? లేక వంతెన నిర్మాణాన్ని ఆపేదాకా వెళ్తాయా? ఎక్కడ జరుగుతోంది ఆ తంతు? ఏ బ్రిడ్జి విషయంలో జరుగుతోంది? తెలంగాణలోని కీలక ప్రాజెక్టుల్లో ఒకటైన జూరాల డ్యాం భద్రతకు సంబంధించిన వంతెన నిర్మాణంపై సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. పాలమూరు జిల్లాలోని ధరూరు- అమరచింత మండలాల మధ్య కృష్ణా నదిపై ఉంది ఈ ప్రాజెక్టు.
1996 లో నిర్మించిన డ్యాం పై నుంచే గద్వాల, వనపర్తి ప్రాంతాలతో పాటు కర్ణాటకకు రాకపోకలు జరుగుతున్నాయి. అయితే…. భారీ వాహనాల కారణంగా డ్యాంకు ప్రమాదం పొంచి ఉందని, వరదలప్పుడు గేట్లు తెరిచేందుకు గ్యాంటీ క్రేన్ ఆపరేటింగ్కు కూడా ఇబ్బందులు వస్తున్నాయని తేల్చి చెప్పారు ఇంజనీర్లు. ఈ క్రమంలో డ్యాంకు సమాంతరంగా కిలోమీటరు దిగువన హైలెవల్ బ్రిడ్జి నిర్మించి ట్రాఫిక్ను దాని మీది నుంచి మళ్లించాలని నిర్ణయించారు. 121కోట్ల 92 లక్షలతో రేవులపల్లి – నందిమల్ల మధ్య హైలెవల్ వంతెన నిర్మాణానికి 2025లో డిజైన్లను ఆమోదించి ప్రభుత్వానికి పంపారు. అదే ఏడాది 2025 జూన్ 1 న ప్రభుత్వం పాలనా పరమైన అనుమతులు మంజూరు చేసింది. ఇదిలా ఉంటే కొత్త వంతెనను డ్యాంకు కిలోమీటర్ దిగువన కాకుండా 11 కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ఎమ్మెల్యేలు క్రిష్ణమోహన్ రెడ్డి , మేఘారెడ్డి , మధుసూదన్ రెడ్డి మరి కొందరు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ప్రతిపాదించారు.
అందుకు అనుగుణంగానే…లొకేషన్ మార్చి గత డిసెంబర్ 1 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంఖుస్థాపన కూడా చేశారు. కానీ… పనులు మాత్రం మొదలవలేదు. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంపై ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎమ్మెల్యేలకు,ఎంపీకి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం వల్లే నిలిచిపోయినట్టు తెలిసింది. ఇటీవల హైదరాబాద్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో సైతం పరిస్థితి అలాగే ఉందట. దీంతో జూరాల హైలెవల్ బ్రిడ్జి అంశం పీటముడిలా మారింది. కేవలం డ్యాం సేఫ్టీ కోసమే అయితే… కిలోమీటర్ దిగువన వంతెన నిర్మిస్తే సరిపోతుందని, వాహనాలు రిస్క్ లేకుండా వంతెన మీది వెళతాయని, అదే… 11 కిలోమీటర్ల దిగువన బ్రిడ్జి కట్టి డ్యాం సేఫ్టీ కోసమని ఎలా చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు లోక్సభ సభ్యురాలు డీకే అరుణ. అదే సమయంలో మరో ప్రతిపాదన కూడా చేస్తున్నారామె.
బీజేపీగా తాము ఎల్లప్పుడూ అభివృద్ధిని కోరుకుంటామని, డ్యాంకు సమీపంలోఇరిగేషన్ నిధులతో ఒక వంతెన నిర్మించి ప్రస్తుతం ఎమ్మెల్యేలు ప్రతిపాదించి, ముఖ్యమంత్రి శంఖు స్థాపన చేసిన ప్రాంతంలో ఆర్ అండ్ బీ నిధులతో హైలెవల్ బ్రిడ్జి కడితే ఎలాంటి అభ్యంతరం ఉండబోదని అన్నారామె. ఇదే అంశంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ ఎంపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ అరోపిస్తోంది. ఈ బ్రిడ్జి వల్ల ఆత్మకూరు – గద్వాల కనెక్టివిటి పెరుగుతుందని, ఈ ప్రాంత అభివ్రుద్దికి మరింత దోహదపడుతుందని చెప్పుకొస్తున్నారు మంత్రి వాకిటి శ్రీహరితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు. ఈ కామెంట్స్ను ఖండిస్తున్నారు ఎంపీ. డ్యామ్ సేఫ్టీ వంతెనతో పాటు మరోటి రెండోది కట్టమని నేను చెబుతుంటే… అభివృద్ధిని అడ్డుకోవడం ఎలా అవుతుందన్నది ఆమె ప్రశ్న. ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేక, వారి వైఫల్యాలని డైవర్షన్ చేసేందుకు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారని అంటున్నారు ఎంపీ. మొత్తం మీద రాజకీయాలతో ముడిపెట్టకుండా డ్యాం సేఫ్టీ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఆత్మకూరు – గద్వాల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలని కోరుతున్నారు జిల్లా వాసులు.




