Monsoon 2026: దేశవ్యాప్తంగా దాదాపు రెండు వారాలుగా నత్తనడకన సాగుతూ, తీవ్ర వర్షపాత లోటుతో ఆందోళన కలిగిస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు మళ్లీ పుంజుకుంటున్నాయి. వర్షాలు లేక అల్లాడుతున్న మధ్య భారత ప్రాంతాలకు ఊరటనిస్తూ, రాబోయే రోజుల్లో మేఘాలు క్రమంగా బలపడి విస్తారంగా వర్షాలు కురిసే సంకేతాలు కనిపిస్తున్నాయని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం.. జూన్ 19 నుంచి జూన్ 25 మధ్య కాలంలో ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాలలో అక్కడక్కడా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుత రుతుపవనాల మందగమనం వల్ల అత్యంత తీవ్రంగా నష్టపోయిన మధ్య భారత ప్రాంతానికి ఈ పరిణామం పెద్ద ఊరటనిచ్చే అంశం. నిజానికి ఈ ప్రాంతాల్లోకి రుతుపవనాలు అధికారికంగా ప్రవేశించినప్పటికీ.. మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్లలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా ఉండి, ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఈ జాప్యం కారణంగా ఖరీఫ్ పంటల సాగు కోసం తగినంత తేమ లేక ఎదురుచూస్తున్న రైతుల్లో వ్యవసాయపరమైన ఆందోళనలు పెరిగాయి.
అయితే, ఇప్పుడు వాతావరణం మారుతోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన ఉరుములు, మెరుపుల వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. జూన్ 21 నుంచి 23 మధ్య పశ్చిమ మధ్యప్రదేశ్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. తూర్పు మధ్యప్రదేశ్లో జూన్ 20 నుంచి 23 వరకు, విదర్భలో జూన్ 19 నుంచి 23 వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయి. ఛత్తీస్గఢ్లో జూన్ 19 నుంచి 23 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనుండగా, జూన్ 22, 23 తేదీల్లో వర్ష తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుంది. ఈ విస్తారమైన వర్షాలు ప్రారంభం కావడానికి ముందే, కొన్ని ప్రాంతాల్లో ముందస్తు రుతుపవన తీవ్రత కనిపించవచ్చు. జూన్ 19, 20 తేదీల్లో పశ్చిమ మధ్యప్రదేశ్లో, అలాగే జూన్ 19న తూర్పు మధ్యప్రదేశ్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రుతుపవనాల రీ-ఎంట్రీ కేవలం మధ్య భారతానికే పరిమితం కాలేదు. రాబోయే వారంలో దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలుగా దక్షిణాది రాష్ట్రాలు నిలవనున్నాయి. జూన్ 19 నుంచి 21 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. కేరళ, మాహే ప్రాంతాల్లో జూన్ 19 నుంచి 23 వరకు భారీ వర్షాలు పడవచ్చు. కర్ణాటక తీరప్రాంతంలో జూన్ 21 నుంచి 25 వరకు, ఉత్తర-దక్షిణ కర్ణాటక అంతర్గత ప్రాంతాలలో జూన్ 22, 23 తేదీల్లో ముంచెత్తే వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు లక్షద్వీప్లో కూడా జూన్ 21న భారీ వర్ష సూచన ఉంది. తొలకరి పలకరింపు తర్వాత ఒక్కసారిగా బ్రేక్ పడినట్లు అనిపించిన రుతుపవనాలు, ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించడానికి సిద్ధమవుతున్నట్లు ఈ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఉత్తర, మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఇంకా ముంచెత్తే భారీ వర్షాలు మొదలుకాకపోయినప్పటికీ.. పెరుగుతున్న మేఘాల కదలికలు, ఉరుముల వంటి పరిణామాలు రుతుపవనాలు మునుపటి కంటే వేగంగా ముందుకు సాగడానికి వాతావరణం అనుకూలంగా మారుతోందని నిరూపిస్తున్నాయి.




