Manmohan Singh: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో అత్యంత సంచలనం సృష్టించిన బొగ్గు బ్లాకుల కేటాయింపుల (కోల్ స్కామ్) కేసులో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు బుధవారం ముగించింది. అంతేకాకుండా ఆయనకు విచారణకు హాజరుకావాలంటూ గతంలో ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్ల ఉత్తర్వులను కూడా రద్దు చేసింది. ఈ కేసులో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సీబీఐ ఇప్పటికే క్లీన్ చిట్ ఇస్తూ ముగింపు నివేదిక (క్లోజర్ రిపోర్ట్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జైమాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఈ సీబీఐ నివేదికను ఆమోదించింది. 2024 డిసెంబర్లో కన్నుమూసిన మన్మోహన్ సింగ్, ఈ తీర్పుతో యూపీఏ కాలం నాటి అతిపెద్ద క్రిమినల్ కేసు నుంచి అధికారికంగా నిర్దోషిగా విముక్తి పొందారు.
సీబీఐ దాఖలు చేసిన ముగింపు నివేదికలను తిరస్కరించడానికి గానీ, ఆయనపై నేరాభియోగాలను స్వీకరించడానికి గానీ ఎలాంటి బలమైన కారణాలు లేవని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. “కేసు విచారణ సంస్థ దాఖలు చేసిన నివేదికలను ఆమోదించడం లేదా తిరస్కరించడంపై ఈ కోర్టు గతంలో విధించిన మార్గదర్శకాలను పరిశీలించాం. సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టులను పక్కనపెట్టి, ఆయనపై విచారణ చేపట్టడానికి ఎటువంటి సహేతుకమైన కారణాలు కనిపించడం లేదు. అందుకే 2015 మార్చి 11 నాటి తీర్పును, ఆ తదనంతరం ఆయనకు జారీ చేసిన సమన్లను రద్దు చేస్తూ విచారణను ముగిస్తున్నాం” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అసలు ఏంటి ఈ కేసు?
2005లో ఒడిశాలోని ‘తలబిరా-2’ బొగ్గు బ్లాకు కేటాయింపులకు సంబంధించి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా, మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి పి.సి. పరాఖ్లతో పాటు మరో ముగ్గురిని నిందితులుగా పేర్కొంటూ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ సమయంలోనే మన్మోహన్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ధర్మాసనం ఆ సమన్ల అమలుపై స్టే విధించింది. దేశ ప్రధానిగా లేదా ప్రజాప్రతినిధిగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు తనను ప్రాసిక్యూట్ చేయడానికి అవసరమైన చట్టబద్ధమైన అనుమతి (సాంక్షన్) లేదని, అలాగే ఈ బొగ్గు బ్లాకుల కేటాయింపు నిర్ణయంలో ఎటువంటి క్రిమినల్ ఉద్దేశం లేదా కుట్ర లేదని మన్మోహన్ సింగ్ ఆరోపణలను ఖండించారు. సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ దాఖలు చేసిన నివేదికను ఆమోదిస్తూ సుప్రీంకోర్టు ఈ కేసును పూర్తిగా ముగించింది.




