కేబినెట్ సమావేశానికి ముందు రాష్ట్ర మంత్రులతో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ వ్యూహం, ప్రజా సమస్యలు, ఎల్నినో పరిస్థితులు వంటి కీలక అంశాలపై చర్చించారు. అనుకున్న సమయానికే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని మంత్రులకు మంత్రి లోకేష్ సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకునేలా ప్రతి మంత్రి, ప్రజాప్రతినిధి క్షేత్రస్థాయిలో పని చేయాలని మంత్రి నారా లోకేష్ సమావేశంలో చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన తీరును ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. ప్రతి ఇంటి వద్ద కనీసం మూడు నిమిషాలైనా గడుపుతూ ప్రభుత్వ పనితీరు, అమలు చేసిన కార్యక్రమాలు, చేపట్టిన అభివృద్ధి చర్యలను ప్రజలకు వివరించాలని లోకేష్ మంత్రులకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు.
అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపైనా సమావేశంలో నారా లోకేష్ మంత్రులతో చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు సమగ్రంగా వివరించాలని సూచించారు. ఇటీవల జలాశయాల్లోకి వరద నీరు రావడం కొంత ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ, నీటి వినియోగంలో జాగ్రత్త అవసరమని అన్నారు. నీటి నిర్వహణలో తొలి ప్రాధాన్యాన్ని తాగునీటి అవసరాలకు, ద్వితీయ ప్రాధాన్యాన్ని పశుగ్రాసం, పశుసంవర్థక అవసరాలకు ఇవ్వాలని లోకేష్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు.
ప్రజా సమస్యలను చర్చించి వాటికి పరిష్కారాలు కనుగొనే వేదికగా అసెంబ్లీని ఉపయోగించుకోవాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పరిపాలనా అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలని.. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బ్రేక్ఫాస్ట్ సమావేశంలో లోకేష్ స్పష్టం చేశారు.




