తమిళ సినీ పరిశ్రమలో నిర్మాణ వ్యయం భారీగా పెరగడం, నటీనటుల పారితోషికాలు భారంగా మారడంతో శనివారం తమిళనాట షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒకేసారి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్స్ తీసుకోకుండా, సినిమా లాభాల్లో వాటా తీసుకునే ‘ప్రాఫిట్ షేరింగ్’ విధానాన్ని అమలు చేయాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ పిలుపు మేరకు ఒక్కరోజు టోకెన్ సమ్మెను నిర్వహించారు.
భారీ పారితోషికాల వల్ల తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని, నిర్మాతలు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని మేకర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రతిపాదించిన రెవెన్యూ షేరింగ్ విధానంపై తమిళ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో నిర్మాతలు ఈ నిరసన బాట పట్టాల్సి వచ్చింది. శనివారం ఒక్కరోజు మాత్రమే ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు. దీంతో ఈ టోకెన్ సమ్మె ప్రభావంతో కోలీవుడ్లో పలు భారీ చిత్రాల షూటింగ్స్ నిలిచిపోయాయి. తారల రెమ్యునరేషన్లు అదుపులో లేకపోతే భవిష్యత్తులో సినిమా నిర్మాణం మరింత కష్టమవుతుందని నిర్మాతలు హెచ్చరిస్తున్నారు. మరి ఈ డిమాండ్పై నడిగర్ సంఘం ఎలా స్పందిస్తుందో, రాబోయే రోజుల్లో కోలీవుడ్లో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.




