బీహార్లోని గయా జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీపై ఆకస్మికంగా రాళ్ల దాడి జరిగింది. అయితే అనూహ్యంగా కేంద్రమంత్రి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ రాయి మాత్రం ఆయన వెనుక ఉన్న అంగరక్షకుడికి తగలడంతో గాయపడ్డాడు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఇద్దరు అనుమానాస్పద యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఘటన తర్వాత భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
శుక్రవారం సాయంత్రం బీహార్లోని గయా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ పాల్గొని జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి వేదికపై నుంచి లేవగానే రాళ్ల దాడి జరిగింది. అయితే రాయి నేరుగా మంత్రికి తగలకపోవడంతో ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకున్నారు. అయితే ఆయన వెనుక ఉన్న అంగరక్షకుడికి మాత్రం గాయాలయ్యాయి. ఖిజ్రసరాయ్ బ్లాక్లోని సిస్వార్ గ్రామంలోని సెయింట్ థామస్ ఇంగ్లీష్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఘటన గురించి సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలంలోని పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఖిజ్రసరాయ్ పోలీస్ స్టేషన్ తక్షణమే చర్యలు చేపట్టి సంఘటనా స్థలం నుంచి ఇద్దరు అనుమానిత యువకులను అదుపులోకి తీసుకుంది. రాళ్ల దాడి వెనుక ఉద్దేశ్యం ఏమిటి, ఈ దాడి ముందుగా ప్లాన్ చేసుకుని జరిగిందా లేక ఆకస్మికంగా జరిగిందా అనే విషయాలను నిర్ధారించడానికి ప్రస్తుతం వారిద్దరినీ విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రతి అంశంపై దర్యాప్తు జరుగుతోందని, ప్రత్యక్ష సాక్షులను కూడా ప్రశ్నిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.




