ఐపీఎల్ 2026లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్) వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ప్రతిష్టాత్మక 67వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ హోమ్ గ్రౌండ్లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించారు. బెంగళూరు జట్టు ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే నిర్ణీత 120 బంతుల్లో 256 పరుగులు చేయాల్సి ఉంది.
సుడిగాలి ఓపెనింగ్..
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సన్రైజర్స్ ఓపెనర్లు ఆర్సీబీ బౌలింగ్పై ఎదురుదాడికి దిగారు. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసి జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అతనికి జతగా ట్రావిస్ హెడ్ ధాటిగా ఆడాడు. ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత కూడా హైదరాబాద్ రన్ రేట్ తగ్గలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుతమైన, అదే సమయంలో అత్యంత వేగవంతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. బెంగళూరు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
క్లాసెన్ మెరుపులు.. నితీష్ కుమార్ రెడ్డి ఫినిషింగ్ టచ్..
మిడిల్ ఓవర్లలో విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తన మార్కు హిట్టింగ్తో స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 24 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్ 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 51 పరుగులు చేసి హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. అతని స్ట్రైక్ రేట్ 212.50గా నమోదైంది.
చివర్లో యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి సైతం ఆర్సీబీ బౌలర్లపై దయాదాక్షిణ్యాలు చూపించలేదు. కేవలం 12 బంతుల్లోనే 3 సిక్సర్లు, 1 ఫోర్తో 29 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ స్కోరుబోర్డు 250 మార్కును సులువుగా దాటేసింది.
తేలిపోయిన బెంగళూరు బౌలింగ్
సన్రైజర్స్ బ్యాటర్ల ధాటికి బెంగళూరు బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 51 పరుగులు ఇవ్వగా, జోష్ హాజిల్వుడ్ 4 ఓవర్లలో ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు. ఇద్దరికీ ఒక్క వికెట్ కూడా దక్కలేదు.
ఆర్సీబీ బౌలర్లలో రాసిఖ్ సలామ్ దార్ కొంతవరకు పర్వాలేదనిపిస్తూ 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సుయాష్ శర్మ (1/36), కృనాల్ పాండ్యా (1/24) చెరో వికెట్ సాధించారు. రొమారియో షెపర్డ్ 3 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోయాడు. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల సమిష్టి విధ్వంసంతో 255 పరుగుల కొండంత లక్ష్యం బెంగళూరు ముందు నిలిచింది. ఈ భారీ టార్గెట్ను ఆర్సీబీ బ్యాటర్లు ఎలా ఛేదిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.




