ED Raids: దక్షిణాది రాష్ట్రాల్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వాటి ద్వారా జరిగినట్లు అనుమానిస్తున్న ఆర్థిక లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది. ‘నశా ముక్త్ భారత్’ కార్యక్రమం నేపథ్యంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఏకకాలంలో భారీ సోదాలు నిర్వహిస్తోంది. దక్షిణ ప్రాంతంలోని ఈడీ పరిధిలో మొత్తం 30 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.
తెలంగాణలో గంజాయి వ్యవహారాలకు సంబంధించి కీలకంగా వినిపిస్తున్న రీతు భాయ్ నివాసంతో పాటు అనుబంధ ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులను ఆధారంగా చేసుకుని, వాటికి సంబంధించిన మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం, నిధుల ప్రవాహం, ఆస్తుల సమీకరణ, ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
గంజాయి అక్రమ విక్రయాల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. రీతు భాయ్కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ముఖ్యంగా అక్రమంగా వచ్చినట్లు అనుమానిస్తున్న నగదు హవాలా మార్గంలో బదిలీ అయిందా.?, ఇతర వ్యక్తులు లేదా సంస్థల ఖాతాల ద్వారా లావాదేవీలు జరిగాయా.? అనే కోణంలో అధికారులు ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
PMLA కింద దర్యాప్తు..
మాదకద్రవ్యాలకు సంబంధించిన ఆర్థిక నేరాలపై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఈడీ దర్యాప్తు చేపడుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లోని మొత్తం ఎనిమిది వేర్వేరు కేసులకు సంబంధించి ఈ ఏకకాల సోదాలు జరుగుతున్నట్లు ఈడీ వెల్లడించింది. సోదాల్లో లభించే పత్రాలు, డిజిటల్ ఆధారాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర ఆర్థిక రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఆర్థిక నెట్వర్క్పై ఫోకస్:
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా వెనుక ఉన్న ఆర్థిక నెట్వర్క్ను వెలికితీయడమే లక్ష్యంగా ఈడీ దర్యాప్తు సాగుతోంది. డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బు ఎక్కడికి మళ్లింది? ఎవరెవరికి చేరింది? ఆ నగదుతో ఆస్తులు కొనుగోలు చేశారా? హవాలా మార్గంలో ఇతర ప్రాంతాలకు తరలించారా? వంటి అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒకేసారి 30 ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సోదాలు డ్రగ్స్ అక్రమ రవాణాతో ముడిపడిన ఆర్థిక వ్యవహారాలపై ఈడీ దృష్టి ఎంతగా కేంద్రీకృతమైందో వెల్లడిస్తున్నాయి. సోదాలు, ఆధారాల పరిశీలన పూర్తయిన తర్వాత ఈడీ అధికారులు తీసుకునే తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.




