హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ నెయ్యి మాఫియాపై హైదరాబాద్ కమిషనర్ టాస్క్ఫోర్స్ విభాగమైన హెచ్-ఫాస్ట్ (H-FAST) విరుచుకుపడింది. నగర కమిషనరేట్ పరిధిలోని కల్తీ నెయ్యి తయారీ, విక్రయ యూనిట్లపై అధికారులు అత్యంత రహస్యంగా, విస్తృతంగా దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాదకర రసాయనాలతో నెయ్యిని తయారు చేస్తున్న మూలాలను మట్టుబెట్టారు. ఈ దాడులకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీపీ వి.సి. సజ్జనార్ విలేకరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించారు. కల్తీ ఆహారం నుంచి తెలంగాణను విముక్తి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన సీపీ, ప్రజల ప్రాణాలతో ఆడుకునే నిందితులపై రాబోయే రోజుల్లో కఠినమైన ‘పీడీ యాక్ట్’ నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు హెచ్చరించారు.
రూ.కోట్ల విలువైన కల్తీ పదార్థాల స్వాధీనం
హెచ్-ఫాస్ట్ నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో దాదాపు 25.5 టన్నుల కల్తీ నెయ్యితో పాటు, దాని తయారీకి వినియోగిస్తున్న 10.5 టన్నుల ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 36 టన్నుల కల్తీ సామాగ్రిని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న పదార్థాల వివరాలు:
కల్తీ నెయ్యి: 25.5 టన్నులు
పాడైపోయిన క్రీమ్: 8.7 టన్నులు
పామాయిల్: 1,200 లీటర్లు
వనస్పతి: 600 లీటర్ల
కల్తీ ఫ్లేవర్ బాటిళ్లు: 3 వెరైటీలకు చెందిన 6 సీసాలు
గంజి పొడి: 30 కిలోలు
ఈ ముఠా నెయ్యి తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాలు అధికారులను సైతం విస్తుపోయేలా చేశాయి. హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పాడైపోయిన క్రీమ్ను తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నారు. దానికి పాల పౌడర్, పామాయిల్, వనస్పతి, గంజి పొడిని కలుపుతున్నారు. వినియోగదారులకు అసలైన నెయ్యిలా పూస పూసగా కనిపించడం కోసం ప్రత్యేకంగా “బొంబాయి రవ్వ”ను మిక్స్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. అసలైన నెయ్యి వాసన రావడం కోసం కెమికల్ ఫ్లేవర్ బాటిళ్లను వాడారు. ఆ బాటిళ్లపై “ఆహారంలో ఉపయోగించరాదు” అని స్పష్టమైన హెచ్చరికలు ఉన్నప్పటికీ, లాభాపేక్షతో దాన్నే నెయ్యిలో కలిపేస్తున్నారు.
ఈ కల్తీ నెయ్యిని ఆవు నెయ్యి, దేశీ నెయ్యి పేరుతో మార్కెట్లో అక్రమంగా విక్రయిస్తున్నారు. ప్రధానంగా హోటళ్లు, ఫంక్షన్లలో వంటకాల కోసం, ప్రముఖ స్వీట్ షాపుల్లో ప్యూర్ నెయ్యి స్వీట్లు అని నమ్మించి అమ్మడానికి, చివరికి ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారీలో కూడా ఈ కల్తీ నెయ్యినే ఉపయోగిస్తుండటం గమనార్హం.
ఇక వీరు ప్యాక్ చేసే ప్యాకెట్లపై ఎలాంటి లేబుల్ ఉండదు. తయారీ తేదీ , ఎక్స్పైరీ తేదీ, అసలు కంపెనీ పేర్లు, చిరునామాలు ఏవీ ముద్రించకుండానే మార్కెట్లోకి వదులుతున్నారు. స్వాధీనం చేసుకున్న నమూనాలను ల్యాబ్కు పంపగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. సాధారణంగా నెయ్యి ప్యూర్ గా ఉందో లేదో తెలిపే ఆర్.ఎమ్ వాల్యూ 24 కంటే ఎక్కువగా, గరిష్ఠంగా 42 వరకు ఉండాలి. కానీ వీరు పామాయిల్, డాల్డా కలపడం వల్ల ఆర్.ఎమ్ వాల్యూలో తీవ్రమైన తేడాలు వచ్చాయి. అంతేకాకుండా ‘అబ్సెంట్’ (సున్నా) అని ఉండాల్సిన విషపూరిత పారామీటర్లు ఏకంగా 20,000 వరకు నమోదయ్యాయని సీపీ తెలిపారు.
ఇలాంటి కల్తీ నెయ్యిని నిత్యం వాడటం వల్ల ప్రజలకు గుండె సంబంధిత తీవ్రమైన వ్యాధులు, కాలేయం పాడవ్వడం, వివిధ రకాల చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ‘టిజి సేఫ్’ (TG SAFE) విభాగంతో సమన్వయం చేసుకుంటూ నగరవ్యాప్తంగా మరిన్ని దాడులు తీవ్రతరం చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడే కల్తీ వ్యాపారులపై ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కమిషనర్ హెచ్చరించారు.




