Petrol and Diesel Prices Cut: పాకిస్థాన్ ప్రభుత్వం ప్రజలకు మరోసారి ఇంధన ధరల విషయంలో ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. గత వారం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన ప్రభుత్వం, తాజాగా మరోసారి ధరల్లో కోత విధించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజా నిర్ణయం ప్రకారం పెట్రోల్ ధరను లీటరుకు రూ.22, హై-స్పీడ్ డీజిల్ (HSD) ధరను కూడా లీటరుకు రూ.22 మేర తగ్గించారు. దీంతో ప్రస్తుతం పాకిస్థాన్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.380గా, డీజిల్ ధర రూ.381గా నిర్ణయించారు. కొత్త ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి.
ఇంధన ధరల తగ్గింపుకు ప్రధాన కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరల్లో నమోదైన పతనాన్ని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు గత వారం రోజుల్లో సుమారు 11 శాతం వరకు తగ్గాయి. అయితే హార్మూజ్ జలసంధి అంశంపై ఇంకా స్పష్టత లేకపోవడంతో భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్తో పాటు కిరోసిన్ ధరలను కూడా ప్రభుత్వం తగ్గించింది. ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ (OGRA) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం కిరోసిన్ ధర లీటరుకు రూ.313.44 నుంచి రూ.272కు తగ్గించబడింది. ఈ ధరలు పాకిస్థానీ రూపాయలలో నిర్ణయించబడ్డాయి.
అయితే ప్రస్తుతం కనిపిస్తున్న ఈ ఉపశమనం కంటే ముందు పాకిస్థాన్ ప్రజలు భారీ ధరల భారం ఎదుర్కొన్నారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో మార్చి 6న ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.55 వరకు పెంచింది. అనంతరం ఏప్రిల్ 2న కూడా పెట్రోల్ ధరను 43 శాతం, డీజిల్ ధరను 55 శాతం వరకు పెంచడం జరిగింది. పెట్రోల్ ధరల పెరుగుదల లేదా తగ్గుదల నేరుగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే పెట్రోల్ను ప్రధానంగా కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోరిక్షాలు వంటి వాహనాల్లో ఉపయోగిస్తారు. మరోవైపు డీజిల్ ధరలు భారీ వాణిజ్య వాహనాలు, సరుకు రవాణా రంగం, పరిశ్రమల నిర్వహణ ఖర్చులను ప్రభావితం చేస్తాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ చమురు మార్కెట్లలో పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో పాకిస్థాన్ ప్రభుత్వం వరుసగా రెండోసారి ధరలు తగ్గించింది. దీంతో అక్కడి ప్రజలకు కొంత ఊరట లభించినప్పటికీ, భవిష్యత్తులో ప్రపంచ మార్కెట్ పరిస్థితులను బట్టి ఇంధన ధరల్లో మళ్లీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




