TDP Mahanadu: తెలుగుదేశం పార్టీ మహానాడులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు భారత రత్న పురస్కారం ఇవ్వాలని సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మహానాడులో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు ప్రతి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఎన్టీఆర్ జయంతి ప్రతి తెలుగువారికి పండుగ రోజు అని పేర్కొన్నారు.
సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్, తన క్రమశిక్షణ, కృషి, నిజాయితీతో సినీరంగంలో అగ్రస్థానానికి చేరుకుని, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారని చంద్రబాబు కొనియాడారు. రైతుబిడ్డగా మొదలై, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి పాత్రల ద్వారా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహానటుడిగా ఆయన నిలిచారని గుర్తుచేశారు. అంతేకాకుండా, ప్రాంతీయ పార్టీగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీని దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా నిలిపిన నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో కూడా టీడీపీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు.
ఎన్టీఆర్ పాలన రైతులకు అండగా, మహిళలకు భరోసాగా, కార్మికులకు అభయంగా, యువతకు దిక్సూచిగా నిలిచిందని తెలిపారు చంద్రబాబు. “సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు” అనే నినాదాన్ని శాశ్వతంగా ప్రజల్లో నాటిన మహానేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. 1983లో యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించిన నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. నిన్న జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ప్రతిపాదించిన 33 శాతం రిజర్వేషన్ అంశాన్ని మనమే ముందుండి అమలు చేయాలని అన్నారు.
తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత ఎన్టీఆర్కు భారత రత్న ప్రకటించాలని మహానాడు ఏకగ్రీవంగా తీర్మానించిందని చంద్రబాబు తెలిపారు. ఇది కేవలం టీడీపీ డిమాండ్ మాత్రమే కాకుండా, ప్రతి తెలుగువారి ఆకాంక్ష అని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికిన మహోన్నత నాయకుడిగా ఎన్టీఆర్ సేవలు అపూర్వమని కొనియాడిన చంద్రబాబు, తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారత రత్న ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. మహానాడులో చంద్రబాబు పిలుపుతో 1875 క్లస్టర్లలో స్టాండప్ ఓవేషన్ ద్వారా ఎన్టీఆర్కు మద్దతు తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.




