Motkupalli Narasimhulu: స్వర్గీయ ఎన్టీఆర్ను గుర్తుచేసుకుంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వం, ప్రజల పట్ల ఆయన చూపిన ప్రేమ, రాజకీయాల్లో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, ఎన్టీఆర్ లాంటి మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేమని అన్నారు. “డబ్బు కోసం ఎగబడేవాడు నిజమైన నాయకుడు కాదు. ఎన్టీఆర్ ప్రజల కోసం జీవించారు” అని వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితాన్ని గుర్తుచేసుకున్న మోత్కుపల్లి, “నా దగ్గర రూపాయి కూడా లేకపోయినా, ఎన్టీఆర్ దయ వల్లే నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను” అని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న నాయకుల ఆరాటమంతా డబ్బు, సీట్లు, పదవుల కోసమేనని విమర్శించారు.
పేదల కోసం మరో ఉద్యమం తీసుకొస్తా
ఎన్టీఆర్ ఆశీస్సులతో మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తానని మోత్కుపల్లి ప్రకటించారు. పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడుతానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలోనే తాను ముందుకు సాగుతానని పేర్కొన్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు..
“9 నెలల్లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు”
ఇదే కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పార్టీ స్థాపించిన కేవలం తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి భారత రాజకీయ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఆర్పై అక్కసు ఉండేదని, అందుకే ఆయనకు భారతరత్న, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి గౌరవాలు ఇవ్వలేదని ఆరోపించారు. మరోవైపు.. ఎన్టీఆర్పై అవినీతి ఆరోపణలు చేసిన వైఎస్సార్ కోర్టుకు రాకుండా తప్పించుకున్నారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని, ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకు వైఎస్సార్ ప్రయత్నించారని ఆరోపించారు. ఇక, రాష్ట్రాభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని బుచ్చయ్య చౌదరి అన్నారు. లోకేష్ నాయకత్వం దెబ్బకు “గొడ్డలి పార్టీ” పరారవుతుందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఆయన సేవలు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని నేతలు పేర్కొన్నారు.




