RR vs SRH: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో సన్రైజర్స్ హైదరాబాద్ను 47 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లింది. ముల్లన్పూర్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాట్తో చెలరేగగా, జోఫ్రా ఆర్చర్ తన వేగంతో హైదరాబాద్ టాప్ ఆర్డర్ను కుదేలు చేశాడు.. దీంతో, ఐపీఎల్ క్వాలిఫయర్ రేస్ నుంచి SRH తప్పుకోవాల్సి వచ్చింది..
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో రాజస్థాన్ ఇప్పుడు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఆ మ్యాచ్ విజేత ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కొంటుంది.
ఈ మ్యాచ్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతను ఐపీఎల్ వేదికపై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన వైభవ్, తన ఇన్నింగ్స్లో 12 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని అతను కేవలం మూడు పరుగుల దూరంలో కోల్పోయాడు. ప్రస్తుతం ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది.
మ్యాచ్ ఆరంభం నుంచే వైభవ్ సూర్యవంశీ సన్రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడాడు. ఫుల్ లెంగ్త్ బంతులను సైట్ స్క్రీన్ మీదుగా పంపించడమే కాకుండా, షార్ట్ బంతులను కూడా సిక్సర్లుగా మలిచాడు. అతని దూకుడును అడ్డుకునేందుకు కమిన్స్ ఫీల్డింగ్ మార్పులు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ సీజన్లో వైభవ్ మరో అరుదైన రికార్డును కూడా సృష్టించాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు క్రిస్ గేల్ పేరిట ఉన్న 59 సిక్సర్ల రికార్డును అధిగమిస్తూ వైభవ్ 65 సిక్సర్లు నమోదు చేశాడు.
కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వైభవ్, టీ20ల్లో డబుల్ సెంచరీ చేసే సామర్థ్యం తనలో ఉందనే సంకేతాలు ఇచ్చాడు. అయితే ఎనిమిదో ఓవర్లో ప్రఫుల్ హింజ్ బౌలింగ్లో థర్డ్ మ్యాన్ వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో అతని చారిత్రాత్మక ఇన్నింగ్స్ ముగిసింది. అవుటైన తర్వాత అతని నిరాశ స్పష్టంగా కనిపించింది. వైభవ్కు తోడుగా ధ్రువ్ జురెల్ కూడా వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 21 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. యశస్వి జైస్వాల్ 29 పరుగులు చేసి అవుటయ్యాడు. ఒక దశలో రాజస్థాన్ 260 పరుగులు దాటేలా కనిపించినా, చివరి ఐదు ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు కొంత నియంత్రణ సాధించారు. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింజ్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే అతను నాలుగు ఓవర్లలో 54 పరుగులు ఇచ్చాడు. పాట్ కమిన్స్కు ఇది మరచిపోలేని చెత్త రోజు అయ్యింది. అతను నాలుగు ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
244 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్రైజర్స్ హైదరాబాద్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ తన వేగవంతమైన బౌలింగ్తో టాప్ ఆర్డర్ను కూల్చేశాడు. అభిషేక్ శర్మను బౌన్సర్తో ఔట్ చేసిన ఆర్చర్, అనంతరం ఇషాన్ కిషన్ను క్యాచ్ అవుట్ చేయించాడు. ట్రావిస్ హెడ్ కూడా అతని వేగాన్ని ఎదుర్కోలేక బౌల్డ్ అయ్యాడు. ఆర్చర్ దెబ్బకు హైదరాబాద్ పవర్ప్లే ముగిసే సరికి నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఐదో ఓవర్ ముగిసేసరికి జట్టు 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం మధ్యవరుస పోరాడేందుకు ప్రయత్నించినా, అవసరమైన రన్రేట్ ఒత్తిడితో వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరికి 196 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. రాజస్థాన్ రాయల్స్కు ఈ విజయం కేవలం మ్యాచ్ గెలుపు మాత్రమే కాదు. ఈ సీజన్ మొత్తం జట్టు చేసిన పోరాటానికి, యువ ఆటగాళ్ల ప్రతిభకు ఇది నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు అందరి దృష్టి క్వాలిఫయర్-2పై ఉంది. గుజరాత్ టైటాన్స్ను ఓడించి ఫైనల్ చేరాలని రాజస్థాన్ ఆశిస్తోంది. మొత్తంగా ఐపీఎల్ నుంచి హైదరాబాద్ జట్టు నిష్క్రమణ.. రాజస్థాన్ క్వాలిఫయర్-2లో అడుగుపెట్టడానికి ప్రధానంగా చిన్నోడు వైభవ్ సూర్యవంశీ బ్యాట్ ఒక కారణమైతే.. జోఫ్రా ఆర్చర్ బంతితో విరుచుకుపడడం రెండో ప్రధాన కారణాలుగా మారాయి..




