విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల కోసం ఆలయ అధికారులు ఉచిత యోగ శిక్షణ ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ మేరకు మార్గదర్శకాలు వెల్లడించారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుండి 14 రోజుల పాటు భక్తులకు.. ఆలయ ఉద్యోగులకు ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఈవో శీనా నాయక్ తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ రాంచంద్రమోహన్ ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రిపై 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉచిత యోగ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రేపటి నుండి (జూన్ 07 నుంచి జూన్ 21 వరకు) 14 రోజుల పాటు ప్రతి రోజు ఉదయం ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ప్రతి రోజు ఉదయం 7:00 గంటల నుంచి 8:00 గంటల వరకు ఇంద్రకీలాద్రిపైనున్న మహా మండపం 6వ అంతస్తులో ఈ యోగా శిక్షణ జరుగుతుందని.. నిపుణులచే యోగ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే భక్తులకు ఉచితంగా ప్రసాదం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ యోగా శిక్షణకు విచ్చేసే భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. కార్యక్రమంలో పాల్గొనే భక్తుల వివరాలను నమోదు చేయబడతాయని పేర్కొన్నారు. ప్రతీ రోజు యోగా సాధన అనంతరం భక్తులందరికీ దేవస్థానం తరపున ఉచిత ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్పారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు, స్థానికులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకుని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఈవో కోరారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చని ఈవో శీనా నాయక్ విజ్ఞప్తి చేశారు.




