Vijay TVK Controversy: విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. విజయ్ గవర్నర్ను కలిసిన తీరు ఇప్పుడు పెను రాజకీయ దుమారానికి దారితీసింది. లోక్ భవన్లో గవర్నర్తో జరిగిన ఈ కీలక భేటీలో విజయ్ వెంట ఇద్దరు వ్యక్తులు కనిపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. వారు మరెవరో కాదు.. విజయ్ తదుపరి చిత్రం ‘జననాయగన్’ నిర్మాత వెంకట్ కె. నారాయణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారవేత్త విష్ణురెడ్డి. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని, పార్టీలో ఎటువంటి అధికారిక హోదా లేని వ్యక్తులు ప్రభుత్వ ఏర్పాటు వంటి అత్యంత కీలకమైన చర్చల సమయంలో గవర్నర్ వద్దకు ఎందుకు వెళ్లారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వెంకట్ కె. నారాయణ సినీ రంగానికి చెందిన వ్యక్తి, ఇక విష్ణు రెడ్డి ఆంధ్రప్రదేశ్లో గ్రానైట్, మైనింగ్ వ్యాపారాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ భేటీలో వీరు ఉండటంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
“తమిళనాడు భవిష్యత్తును నిర్ణయించే చర్చల్లో కర్ణాటకకు చెందిన సినీ నిర్మాత, ఆంధ్రకు చెందిన గ్రానైట్ వ్యాపారికి ఏం పని?” అని ఒక వినియోగదారుడు ప్రశ్నించగా.. “వీరు బయటి వ్యక్తులు, తమిళనాడు రాజకీయాల్లో వీరి పాత్ర ఏంటి? రేపు వీరే ప్రభుత్వం నడుపుతారా?” అంటూ మరికొందరు మండిపడుతున్నారు. అసలు రాజకీయ హోదా లేని ప్రైవేట్ వ్యక్తులను అధికారిక భేటీకి గవర్నర్ కార్యాలయం ఎలా అనుమతించిందనే కోణంలోనూ వివరణ కోరుతున్నారు. ప్రస్తుతానికి వీరికి పార్టీలో ఎలాంటి పదవులు లేవని తెలుస్తోంది. కేవలం విజయ్తో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం వల్లే వెళ్లినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. వీసీకే (VCK) పార్టీ ఇంకా మద్దతు లేఖ ఇవ్వకపోవడం, ఐయూఎంఎల్ (IUML) డీఎంకే కూటమిలోనే ఉండాలని నిర్ణయించుకోవడం వంటి పరిణామాలు విజయ్ రాజకీయ ప్రయాణంలో ఉత్కంఠను పెంచుతున్నాయి. ఇటు కూటమి చర్చలు, అటు వెంట వచ్చిన వ్యక్తులపై రేగుతున్న వివాదాలతో తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.




