హమ్మయ్య.. ఎట్టకేలకు తమిళనాడులో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గత 6 రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ఫుల్స్టాప్ పడింది. వీసీకేకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. విజయ్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. టీవీకేకు మద్దతు తెల్పుతూ వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ లేఖ అందజేశాడు. టీవీకే నేత ఆధవ్ అర్జునకు లేఖను అందజేశారు. దీంతో విజయ్ బలం 118కు చేరింది.
వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కు చేరడంతో మరికాసేపట్లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను విజయ్ కలవనున్నారు. మద్దతు లేఖను గవర్నర్కు అందజేయనున్నారు. మొత్తానికి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేస్తే విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు.
ఇదిలా ఉంటే ఈరోజు సాయంత్రమే గవర్నర్ అర్లేకర్ కేరళం వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ప్రమాణస్వీకారం ఈ రాత్రికే ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పరిస్థితులు గందరగోళంగా మారాయి. ఈ నేపథ్యంలో మళ్లీ పరిస్థితులు చేజారకముందే ప్రమాణస్వీకారం చేస్తే మంచిది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సోమవారం వెలువడిన ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించవచ్చని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా అంచనాలు తారుమారయ్యాయి. పూర్తి మ్యాజిక్ ఫిగర్తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని విజయ్కు సూచించారు. దీంతో కాంగ్రెస్, వామపక్షాల మద్దతు ఇవ్వడంతో విజయ్ బలం 116కు చేరింది. అయితే మరో రెండు స్థానాలు ఉన్న వీసీకేకు చెందిన పార్టీ మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గింది. దీంతో మ్యాజిక్ ఫిగర్కు విజయ్ చేరుకోకపోవడంతో రాజకీయ అనిశ్చితి అలానే కొనసాగింది. మొత్తానికి విజయ్కు మద్దతు ఇవ్వాలని వీసీకే నిర్ణయం తీసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.




