Vaibhav Sooryavanshi Next Match: భారత క్రికెట్లో కొత్త సంచలనంగా ఎదుగుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై మరోసారి అందరి దృష్టి పడింది. ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్తో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్న ఈ యువ ఆటగాడు, ఇండియా ‘ఎ’ జట్టుకు ఎంపికై శ్రీలంకలో జరుగుతున్న త్రైపాక్షిక వన్డే సిరీస్లో ఆడుతున్నాడు. అయితే తొలి మ్యాచ్లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయిన వైభవ్కు ఇప్పుడు పునరాగమనం చేసే అవకాశం లభించింది.
దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించి..
శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ ప్రారంభించాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే మూడు ఆకర్షణీయమైన ఫోర్లు బాదుతూ తన దూకుడు ఆటను ప్రదర్శించాడు. అయితే మంచి ఊపులో కనిపించిన సమయంలోనే ఒక తొందరపాటు షాట్ ఆడేందుకు ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు. మహమ్మద్ షిరాజ్ బౌలింగ్లో మిడ్-ఆఫ్ మీదుగా భారీ షాట్ ఆడబోయిన వైభవ్, శ్రీలంక ‘ఎ’ కెప్టెన్ సహన్ అరచ్చిగే చేతికి చిక్కాడు. దీంతో కేవలం 14 పరుగులకే అతని ఇన్నింగ్స్ ముగిసింది. ఐపీఎల్లో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాడి నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశించిన నేపథ్యంలో ఈ అవుట్ నిరాశ కలిగించింది.
అయితే వ్యక్తిగతంగా వైఫల్యం ఎదురైనా, ఇండియా ‘ఎ’ జట్టు మ్యాచ్లో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 277/6 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ అద్భుత సెంచరీతో జట్టుకు బలమైన స్కోరు అందించగా, తిలక్ వర్మ కీలక అర్ధసెంచరీతో రాణించాడు. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ జట్టు ఒక దశలో విజయానికి చేరువైంది. కెప్టెన్ సహన్ అరచ్చిగే 74 పరుగులతో చెలరేగాడు. అయితే చివరి దశలో భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకుని మ్యాచ్ను తమవైపు తిప్పుకున్నారు. ముఖ్యంగా అర్షద్ ఖాన్ చివరి ఓవర్లో కీలక వికెట్లు తీసి ఇండియా ‘ఎ’కు 8 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందించాడు.
తర్వాత మ్యాచ్ ఎప్పుడు..?
ఇప్పుడు ఇండియా ‘ఎ’ జట్టు తన తదుపరి మ్యాచ్లో జూన్ 11న ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’తో తలపడనుంది. దంబుల్లాలోని రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో అందరి చూపు మళ్లీ వైభవ్ సూర్యవంశీపైనే ఉండనుంది. తొలి మ్యాచ్లో నిరాశపరిచిన ఈ యువ బ్యాట్స్మన్, ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’పై భారీ ఇన్నింగ్స్ ఆడి తన ప్రతిభను మరోసారి నిరూపిస్తాడా అనే ఆసక్తి నెలకొంది. ఐపీఎల్లో చూపిన దూకుడును కొనసాగిస్తూ, పరిస్థితులకు అనుగుణంగా ఆడగలిగితే వైభవ్ మరోసారి వార్తల్లో నిలిచే అవకాశం ఉంది.
ఇండియా ‘ఎ’ జట్టుకు ఈ మ్యాచ్ కూడా కీలకమే. వరుస విజయాలతో టోర్నమెంట్లో ఆధిపత్యం చాటాలని తిలక్ వర్మ సేన భావిస్తుండగా, యువ ఆటగాళ్ల ప్రదర్శనపై సెలెక్టర్ల దృష్టి కూడా ఉండనుంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’తో మ్యాచ్ వైభవ్ సూర్యవంశీకి మాత్రమే కాకుండా మొత్తం జట్టుకూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇండియా ఎ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ , ప్రియాంష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, అనుకూల్ రాయ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, విపరాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్ చరక్, యుధ్వీర్ సింగ్ చరకిష్ ఉండగా..
ఆఫ్ఘనిస్తాన్ ఎ జట్టు: ఇమ్రాన్ మీర్ (కెప్టెన్), నూర్-ఉల్-రహమాన్, హసన్ ఇసాఖిల్, బహిర్ షా, ఎజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్, ఫర్మానుల్లా సఫీ, షమ్స్-ఉర్-రహమాన్, ఖలీల్ గుర్బాజ్, జహీర్ ఖాన్, ఫరీదూన్ దౌద్జాయ్, మహ్మద్ వాల్షా ఇబ్రహీం, అబ్దుల్లా ఇబ్రహీం, అబ్దుల్లా ఇబ్రహీం రహీమి మరియు ఫైసల్ ఖాన్ అహ్మద్జాయ్ ఉన్నారు..




