మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం తప్పదా? ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు అవకాశమే లేదా? ఇప్పట్లో పంచాయితీ తేలేదే కాదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజా పరిస్థితులు చూస్తుంటే మరోసారి మధ్యప్రాచ్యం అట్టుడికేటట్టు కనిపిస్తోంది.
యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ తాజాగా సమర్పించిన శాంతి ప్రతిపాదనను అమెరికా తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ ఆక్సియోస్ వెల్లడించింది. ఈ ప్రతిపాదనలో గణనీయమైన మార్పులు లేవని, అమెరికా ప్రధాన ఆందోళనలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని అమెరికా అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ దౌత్యపరమైన పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ.. ఇరాన్ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అణు కార్యక్రమంపై అమెరికా కోరుతున్న కీలక షరతులను టెహ్రాన్ అంగీకరించకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ప్రతిపాదన
ఆదివారం రాత్రి పాకిస్థాన్ మధ్యవర్తుల ద్వారా ఇరాన్ తన తాజా ప్రతిపాదనను అమెరికాకు పంపినట్లు ఆక్సియోస్ పేర్కొంది. ఇందులో అణ్వాయుధాల తయారీ చేయబోమనే హామీని ఇరాన్ మరింత స్పష్టంగా ప్రస్తావించినప్పటికీ.. యురేనియం శుద్ధీకరణ నిలిపివేత లేదా అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను బదిలీ చేయడం వంటి అంశాలపై స్పష్టమైన హామీలు లేవని అమెరికా అధికారులు అభిప్రాయపడ్డారు.
వైట్ హౌస్ వర్గాల ప్రకారం.. ఈ ప్రతిపాదన “గణనీయమైన పురోగతి”గా భావించే స్థాయిలో లేదని, ఒప్పందానికి దారి తీసేలా కనిపించడం లేదని తెలిపారు. చర్చలు ఇలాగే నిలిచిపోతే మళ్లీ యుద్ధ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించినట్లు సమాచారం.
ఆంక్షల సడలింపుపై చర్చ
ఇక ఇరాన్కు అనుబంధంగా ఉన్న వర్గాల ప్రకారం.. చర్చల సమయంలో ఇరాన్పై ఉన్న చమురు ఆంక్షలను తాత్కాలికంగా సడలించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వచ్చాయని చెబుతున్నారు. ముఖ్యంగా OFAC (విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం) ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేయాలని అమెరికా ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఇరాన్ మాత్రం దేశంపై ఉన్న అన్ని ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై అమెరికా అధికారులు స్పందిస్తూ.. ఇరాన్ నుంచి ప్రతిఫలంగా కీలక చర్యలు లేకుండా ఎలాంటి ఆంక్షల సడలింపులు ఉండవని స్పష్టం చేశారు.
మళ్లీ యుద్ధమా?
ఆక్సియోస్ కథనం ప్రకారం.. మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతీయ భద్రతా బృందంతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. చర్చలు కొనసాగించాలా? లేక ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలా? అన్న అంశంపై సమీక్ష జరగనున్నట్లు తెలుస్తోంది. ఒక సీనియర్ అమెరికా అధికారి మాట్లాడుతూ.. “ఇరాన్ తన వైఖరిని మార్చుకోకపోతే పరిస్థితి బాంబుల దిశగా వెళ్లే అవకాశం ఉంది” అని హెచ్చరించినట్లు సమాచారం. ఇక ట్రంప్ కూడా ఇటీవల మాట్లాడుతూ.. “సమయం గడుస్తోంది. ఇరాన్ సడలింపు చూపకపోతే మరింత తీవ్రమైన దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని హెచ్చరించారు.
ఇంకా దూరంగానే ఒప్పందం
ఇప్పటికీ ఇరాన్, అమెరికా మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ఒప్పందం నిర్మాణంపై ఇరుదేశాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అమెరికా అణు పరిమితులపై స్పష్టమైన హామీలు కోరుతుండగా.. ఇరాన్ మాత్రం ముందుగా పూర్తి స్థాయి ఆంక్షల ఎత్తివేత జరగాలని పట్టుబడుతోంది. ప్రస్తుతం పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో.. దౌత్యపరమైన పరిష్కారం సాధ్యమవుతుందా? లేక మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయా? అన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.




