పశ్చిమాసియా యుద్ధం మళ్లీ మొదలు కాబోతుందా? ఇరాన్పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులకు సిద్ధపడుతున్నాయా? ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు సిద్ధమైందా? గల్ఫ్ దేశాలు లక్ష్యంగా భీకర దాడులు జరగొచ్చా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
అమెరికాతో శాంతి చర్చలకు ఇరాన్ ముందుకు రావడం లేదు. చర్చల పేరుతో కాలక్షేపం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే ఇరాన్పై మళ్లీ భారీ స్థాయిలో దాడి చేయాల్సి రావొచ్చని వార్నింగ్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ‘‘యుద్ధం జరగకూడదని ఆశిస్తున్నాను. కానీ అవసరమైతే వారికి మరోసారి భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు. ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేను.. చాలా త్వరలో మీకు తెలుస్తుంది’’ అని హెచ్చరించారు.
ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకునేందుకు పరిమిత సమయం మాత్రమే ఇస్తున్నామని.. ఎందుకంటే ఇరాన్కు అణ్వాయుధాలు ఉండనివ్వబోమని స్పష్టం చేశారు. ‘‘వాళ్లు ఆ ఆయుధాలను ఉపయోగిస్తారనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. నేను వారితో వ్యవహరిస్తున్నాను.. వారు తీవ్ర మౌలికవాదులు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సాంకేతికంగా ఏప్రిల్ 8 నుంచి అమల్లో ఉంది. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా ఇరాన్పై దాడులు ప్రారంభించిన తర్వాత నెలల తరబడి జరిగిన ఘర్షణల అనంతరం ఈ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే మధ్యవర్తుల ద్వారా చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి.
ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో కూడా స్పందించారు. ఇరాన్పై అమెరికా చేయాలని భావించిన దాడిని తాత్కాలికంగా నిలిపివేయాలని గల్ఫ్ దేశాల నేతలు కోరారని తెలిపారు. ప్రస్తుతం కీలక చర్చలు జరుగుతున్నందున దాడిని వాయిదా వేసినట్లు చెప్పారు. అవసరమైతే పూర్తి స్థాయి భారీ సైనిక దాడికి అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఒప్పందం కుదరకపోతే క్షణాల్లోనే ఇరాన్పై భారీ దాడికి అమెరికా సైన్యాన్ని సిద్ధంగా ఉండమని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఇక ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాది ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ట్రంప్ బెదిరింపునే శాంతికి అవకాశం అంటున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు ఇరాన్ సైన్యం కూడా ప్రతిదాడుల హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ సైన్య ప్రతినిధి మొహమ్మద్ అక్రమినియా మాట్లాడుతూ.. అమెరికా మళ్లీ దాడులు ప్రారంభిస్తే అమెరికాపై ‘‘కొత్త యుద్ధ ఫ్రంట్లు’’ తెరవబడతాయని హెచ్చరించారు. కాల్పుల విరమణ సమయంలో ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుందని కూడా పేర్కొన్నారు.
ఇక ఈ ఉద్రిక్తతల మధ్య మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని బరాకా అణు విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని మే 17న మూడు డ్రోన్లు దాడికి యత్నించినట్లు యూఏఈ వెల్లడించింది. ఆ డ్రోన్లు ఇరాక్ భూభాగం నుంచి ప్రయాణించినట్లు సాంకేతిక దర్యాప్తులో తేలిందని తెలిపింది. ఈ ఘటనకు ఇరాన్ లేదా ఇరాన్ మద్దతు గల గ్రూపులు కారణమై ఉండొచ్చని యూఏఈ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి.
ఇదిలా ఉంటే అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో చర్చలు కొనసాగుతున్నాయి. చర్చలకు మరింత సమయం అవసరమని ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాజిద్ అల్ అన్సారీ తెలిపారు. గత నెల పాకిస్థాన్లోనే అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ.. ట్రంప్ తాజా హెచ్చరికలు.. ఇరాన్ ప్రతిస్పందనలు చూస్తుంటే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
.@POTUS on Iran: "Whether it's popular or not popular, I have to do it — because I'm not going to let the world be blown up on my watch. It's not going to happen." pic.twitter.com/zL4eSIndsY
— Rapid Response 47 (@RapidResponse47) May 19, 2026




