భారతీయ రైల్వే వ్యవస్థలో కొత్త మార్పులు జరగబోతున్నాయి. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా సేవలు రాబోతున్నాయి. క్షణాల్లో రిజర్వేషన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు జరగుతున్నాయి. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త విధానం ఆగస్టు నుంచి అమల్లోకి రానుంది. 1986 నుంచి అమలులో ఉన్న పాత వ్యవస్థ స్థానంలో రైలు టిక్కెట్ల బుకింగ్ను క్రమంగా కొత్త పీఆర్ఎస్ (PRS)కు మార్చనుంది. రైల్వే ఇప్పుడు 40 ఏళ్ల నాటి ఈ వ్యవస్థ స్థానంలో ఏఐ (AI) సాంకేతికతను ప్రవేశపెట్టబోతుంది.
ఏఐ టెక్నాలజీ ఉపయోగించడంతో టిక్కెట్ల బుకింగ్ ప్రక్రియను సులభతరం కానుంది. వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం, ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందించడం ఈ సంస్కరణ ముఖ్య ఉద్దేశ్యం. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్ భవన్లో ఈ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుత ప్రయాణీకుల రిజర్వేషన్ వ్యవస్థ (PRS) 1986లో ప్రవేశపెట్టబడింది. అప్పటి నుంచి ఇందులో చాలా తక్కువ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు దీనిని కొత్త సాంకేతికతతో పూర్తిగా పునఃరూపకల్పన చేశారు, దీంతో మునుపటి కంటే వేగంగా మరిన్ని టిక్కెట్ బుకింగ్లను అందించనుంది. భారతీయ రైల్వే 2002లో ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ను ప్రవేశపెట్టింది. నేడు చాలా మంది కౌంటర్లకు వెళ్లడం కంటే ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం సుమారు 88 శాతం టిక్కెట్ బుకింగ్లు డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారానే జరుగుతున్నాయి. ఈ మార్పు రైల్వేల డిజిటలైజేషన్ ప్రణాళికలో భాగం. జూలై 2025లో ప్రారంభించబడిన రైల్వన్ యాప్.. ఏడాదిలోపే 3.5 కోట్ల డౌన్లోడ్లను అధిగమించింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లను బుక్ చేసుకోవడం, రద్దు చేసుకోవడం, రైలు స్థితిని తనిఖీ చేయడం, ప్లాట్ఫాం, కోచ్ సమాచారాన్ని పొందడం, ఫిర్యాదులు చేయడం వంటి అనేక రకాల సేవలను పొందుతున్నారు. మొత్తంమీద ఈ కొత్త వ్యవస్థ, యాప్ ప్రయాణికులకు రైల్వే సేవలను మరింత అందుబాటులోకి తెస్తున్నాయి.
కొత్త వ్యవస్థ ముఖ్య లక్షణం ఏఐ ఆధారిత వెయిటింగ్ లిస్ట్ అంచనా. దీనిని ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రవేశపెట్టారు. వెయిట్లిస్ట్లో ఉన్న టిక్కెట్ ఖరారు అయ్యే సంభావ్యతను ఈ ఫీచర్ సూచిస్తుంది. రైల్వేల ప్రకారం.. కచ్చితత్వం గతంలో 53 శాతం నుంచి 94శాతానికి పెరిగింది. ఇది ప్రయాణికులు తమ ప్రయాణాలను మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఆగస్టులో కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ను ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందిస్తూ.. టిక్కెట్ బుకింగ్ను వేగవంతంగా.. స్మార్ట్గా, మరింత విశ్వసనీయంగా మార్చడమే రైల్వేల లక్ష్యం.




