Telangana Auto, Cab & School Van Strike: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్లు బంద్ కానున్నాయి. రవాణా రంగ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడానికి నిరసనగా, దాదాపు 18 రవాణా సంఘాలతో కూడిన ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఈ బంద్కు పిలుపునిచ్చింది. శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలను ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదని, దీనివల్ల లక్షలాది మంది డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బంద్ ద్వారా రవాణా సంఘాల నేతలు ప్రభుత్వం ముందు అనేక డిమాండ్లను ఉంచారు. ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీనితో పాటు ప్రతి ఆటో డ్రైవర్కు ఏటా రూ. 12 వేల ఆర్థిక సహాయం అందించాలని, ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల భద్రత కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్లాట్ఫామ్లలో అనుమతులు లేకుండా నడుస్తున్న బైక్ ట్యాక్సీ సేవలపై తక్షణమే నిషేధం విధించాలని, గిగ్ వర్కర్స్ రక్షణ కోసం ‘అగ్రిగేటర్ పాలసీ’ని తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ చలాన్ల భారంతో నలిగిపోతున్న డ్రైవర్లను ఆదుకునేందుకు పాత చలాన్లపై 80 శాతం సబ్సిడీ ఇవ్వాలని, నిలిపివేసిన ఆటో త్రీవీలర్ లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.




