Tamil Nadu: తమిళనాడులోని విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం దేవాలయ నిధుల వినియోగంపై కీలక చర్యను ప్రారంభించింది. హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ శాఖ పరిధిలోని దేవాలయ నిధులతో చేపట్టాలని భావించిన రూ. 245.85 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులకు ఇచ్చిన పరిపాలన అనుమతుల్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 29 కళ్యాణ మండపాలను రూ. 115 కోట్లతో, 17 కమర్షియల్ సముదాయాలను రూ. 130 కోట్లతో నిర్మించాలనే ప్లాన్ నిలిచిపోయింది.
ప్రాజెక్టులు కొన్ని న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోవడం, దేవాలయాలపై ఆర్థిక భారం పెరగడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దేవాలయ నిధుల్ని వాణిజ్య కార్యకలాపాల కన్నా ఆలయ అభివృద్ధి, భక్తుల సంక్షేహం, వారసత్వ పరిరక్షణ వంటి కార్యక్రమాలకు వినియోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేవాలయ నిధులతో భక్తులకు, దేవాలయాలకు ప్రయోజనం చేకూరే కొత్త పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు వెల్లడించారు.
గతంలో డీఎంకే ప్రభుత్వం దేవాలయ నిధులతో ఈ ప్రాజెక్టుల్ని చేపట్టింది. అయితే, ఈ నిర్ణయంపై రాజకీయంగా విమర్శలు వచ్చాయి. దేవాలయ ఆదాయాన్ని పెంచడంతో పాటు భక్తులకు తక్కువ ఖర్చుతో వివాహ వేదికలు అందించేందుకు ఈ ప్రాజెక్టులు చేపట్టినట్లు గతంలో డీఎంకే పేర్కొంది. తాజాగా విజయ్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై డీఎంకే తీవ్ర విమర్శలు చేస్తోంది. బీజేపీ డిమాండ్లకు అనుగుణంగా అధికార టీవీకే ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉంటే, ప్రజలు దేవాలయ నిధుల్ని దేశాలయాలకే వినియోగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు.




