హమ్మయ్య.. ఎట్టకేలకు తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పచ్చజెండా ఊపారు. శనివారం సాయంత్రం 6:30 గంటలకు నాలుగో సారి గవర్నర్ను విజయ్ కలిశారు. మద్దతు తెలిపిన పార్టీలతో విజయ్ గవర్నర్ను కలిశారు. దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగింది. మద్దతు లేఖలను పరిశీలించిన తర్వాత గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 3:15 నిమిషాలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాణస్వీకారానికి పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేయనున్నారు.

సోమవారం వెలువడిన ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించవచ్చని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా అంచనాలు తారుమారయ్యాయి. పూర్తి మ్యాజిక్ ఫిగర్తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని విజయ్కు సూచించారు. దీంతో కాంగ్రెస్, వామపక్షాల మద్దతు ఇవ్వడంతో విజయ్ బలం 116కు చేరింది. అయితే మరో రెండు స్థానాలు ఉన్న వీసీకేకు చెందిన పార్టీ మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గింది. దీంతో మ్యాజిక్ ఫిగర్కు విజయ్ చేరుకోకపోవడంతో రాజకీయ అనిశ్చితి అలానే కొనసాగుతోంది. మొత్తానికి శనివారం వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వీసీకేతో పాటు ముస్లిం లీగ్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. దీంతో విజయ్ బలం 120కి చేరింది.




