తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్కు లైన్క్లియర్ అయింది. ఐదు రోజుల ఉత్కంఠకు తెరపడింది. శుక్రవారం సాయంత్రం లోక్భవన్లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను టీవీకే అధినేత విజయ్ కలిసి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు. వామపక్షాలు, వీసీకేతో పాటు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) కూడా మద్దతు ప్రకటించింది. దీంతో విజయ్ బలం 120కి చేరింది. ఈ నేపథ్యంలో సంతృప్తి చెందిన గవర్నర్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని విజయ్కు అనుమతి ఇచ్చారు. దీంతో శనివారమే విజయ్ ప్రమాణస్వీకారం చేసేందుకు రెడీ అయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియాన్ని సిద్ధం చేశారు. ఇక పెద్ద ఎత్తున అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు రానున్నందున పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక గవర్నర్ను కలిసిన అనంతరం వామపక్ష కార్యాలయాలకు వెళ్లి నేతలను కలిశారు. విజయ్ను సాదరంగా ఆహ్వానించారు. మద్దతు తెలిపినందుకు వామపక్ష నేతలకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
టీవీకే పార్టీకి సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలతో పాటు ముస్లిం లీగ్ కూడా మద్దతు తెల్పింది. ఈ పార్టీల దగ్గర రెండేసి ఎమ్మెల్యేల సీట్లు ఉన్నాయి. దీంతో విజయ్ బలం 120కు చేరింది. ఇప్పటికే కాంగ్రెస్ తన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతును ప్రకటించాయి. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.
ఇక మంత్రివర్గంలో వీసీకేకు ఒక మంత్రి పదవి, కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు దక్కవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వామపక్షాలైతే కేబినెట్ చేరబోమని స్పష్టం చేశాయి. 20 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయొచ్చని కథనాలు వస్తున్నాయి.





