Off The Record: హైదరాబాద్ మెట్రో కేంద్రంగా మాటల మంటలు రేగుతున్నాయి. ఫేజ్-2 పై తెలంగాణ నేతల మధ్య పొలిటికల్ వార్ పెరుగుతోంది. ఇది తిరిగి తిరిగి కాంగ్రెస్, బీజేపీ మధ్య యుద్ధంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులు, ఆమోదాల అంశాలకు సంబంధించి విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. మెట్రో కారిడార్స్లాగే… ఇది రకరకాల మలుపులు తిరిగి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అనే స్థాయికి చేరింది. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం అందించడం లేదని, పలుమార్లు ప్రతిపాదనలు పంపినా ఆమోదించడంలో అంతులేని జాప్యం జరుగుతోందని ఆరోపిస్తోంది రాష్ర్ట ప్రభుత్వం. ఈ ఇష్యూలో సీఎం నేరుగా…సెంట్రల్ మినిస్టర్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకురావడంలో కిషన్రెడ్డి విఫలమయ్యారని, ఇంకా చెప్పాలంటే అడుకుంటున్నారంటూ విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అటు కిషన్ మాత్రం రెండో ఫేజ్కు కేంద్రం ఆమోదం తెలుపుతుందని, అందుకు కొన్ని పద్ధతులంటూ ఉంటాయి కదా అని లాజిక్ చెబుతున్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంపై నెపం మోపుతున్నారని విమర్శిస్తున్నారు కాషాయ నాయకులు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడి డైవర్షన్ కోసం ప్రయత్నించారన్నది బీజేపీ వాయిస్. ప్రస్తుతం అయితే… ఇష్యూలో రాజకీయంగా పైచేయి సాధించేందుకు కాంగ్రెస్, బీజేపీ… రెండు పార్టీలు గట్టిగా పావులు కదుపుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రాజకీయవర్గాల్లో. ఇది కేవలం మెట్రో ప్రాజెక్టు వివాదం మాత్రమే కాదని, రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీల మధ్య రాజకీయ పోరాటం అన్న విశ్లేషణలు సైతం పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం స్థాయికి ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా…. నిధుల విషయంలో సహకారం లేందటూ…కేంద్రం మీద వత్తిడి పెంచి ప్రజల ముందు బీజేపీని దోషిగా నిలబెట్టాలని, డిఫెన్స్లోకి నెట్టాలన్న ప్లాన్లో కాంగ్రెస్ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పంచాయతీనే కనిపించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ కేంద్ర ప్రభుత్వంపై వివక్ష ఆరోపణలు చేస్తూ, తెలంగాణకు రావాల్సిన నిధులు నిలిపివేస్తున్నారని విమర్శించేవారు. ముఖ్యంగా ప్రాజెక్టులు, జాతీయ హోదాలు, విభజన హామీల అంశాల్లో కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడేవారు.
ఆ రకంగా కేంద్రం అన్యాయం చేస్తోందనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని, ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ అదే పని చేస్తోంటూ విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. అప్పుడు BRSను ప్రజలు నమ్మలేదని, ఇప్పుడు సీఎం రేవంత్ చెబుతున్న మాటల్ని కూడా అదే రీతిలో నమ్మబోరంటూ కాన్ఫిడెంట్గా చెబుతున్నారు కాషాయ నాయకులు. కిషన్ రెడ్డి మీద అప్పుడు కేసీఆర్ మాట్లాడినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ప్రజలు కూడా అదే రీతిలో బుద్ధి చెపుతారంటూ ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు కమలం లీడర్స్. మొత్తానికి గ్రేటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్స్కు ఎన్నికలు జరగబోతున్న టైంలో… మెట్రో రైలు కేవలం ప్రజా రవాణా సాధనంగానే కాక, పొలిటికల్ మైలేజ్ సాధించే బలమైన అస్త్రంగా మారిపోయిందనే అభిప్రాయం బలపడుతోంది. ఈ క్రెడిట్ వార్లో అసలు ప్రాజెక్ట్ ఎంతవరకు ముందుకుసాగుతుందనేది చూడాలి.




