Nashik TCS Case: ఐటీ దిగ్గజం టీసీఎస్ నాసిక్ బీపీఓ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బలవంతపు మతమార్పిడులు, లైంగిక వేధింపులు కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు బాధితులను, ఇతర మహిళా ఉద్యోగుల్ని సోషల్ మీడియాలో వేధించేవారని పోలీసులు దర్యాప్తులో తేలింది. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా నిందితులు మహిళలకు మెసేజ్లు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Read Also: Donald Trump: ఇకపై మంచివాడిలా ఉండను, ఇరాన్ ‘‘కిల్లింగ్ మిషన్’’ అంతం చేస్తా..
ఈ కేసులో ఏడుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, మరో నిందితురాలు నిదా ఖాన్ పరారీలో ఉంది. మహిళా ఉద్యోగులకు పంపినట్లు ఆరోపించబడుతున్న ఆడియో, అసభ్యకరమైన వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన వీడియోలను పోలీసులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఒక నిర్దిష్ట మతపరమైన ఎజెండాతో, నిందితులు ఆఫీసులోని మహిళా ఉద్యోగుల పట్ట ఏదైనా చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు మొబైల్, ఇతర సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సేకరించిన డిజిటల్ ఆధారాలు ఈ కేసును ఛేదించడంలో తమకు సహయపడుతాయని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు, ఈ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఎంటరైంది. సంస్థలో కీలక అధికారులకు, మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తీసుకున్న చర్చలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో 9 మంది బాధితులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇందులో 8 మంది మహిళా బాధితులు ఉండగా, మరొకరు పురుషుడు. మతాన్ని కించపరిచేలా మాట్లాడటం, లైంగిక వేధింపులు, మతమార్పిడి ఆరోపణలపై కేసులు బుక్ అయ్యాయి. సంస్థలో టీమ్ లీడర్లుగా ఉన్న ముస్లిం ఉద్యోగులపై ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.




