Monsoon 2026: ఎండల తీవ్రతతో అల్లాడిపోయిన భారతీయులకు నైరుతి రుతుపవనాలు చల్లని కబురు మోసుకొచ్చాయి. దేశవ్యాప్తంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ కోట్లాది మందికి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. గురువారం (జూన్ 4) కేరళను తాకిన ఈ పవనాలు, ప్రస్తుతం దక్షిణాది, తీరప్రాంతాల్లో విస్తరిస్తూ విస్తారంగా వర్షాలు కురిపిస్తున్నాయి. శనివారం (జూన్ 6) నాటికి కర్ణాటక, తమిళనాడు, గోవా ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉండటంతో రాబోయే రోజుల్లో ఇవి మరింత ఉత్తర దిశగా ప్రయాణించనున్నాయి. అయితే, ఈ వర్షాలు ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాలకు భారీ ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో (జూన్ 6, 7) అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు, పట్టణాల్లో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున స్థానిక ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరోవైపు, దక్షిణాదిన రుతుపవనాల వానలు కురుస్తుంటే, ఉత్తర, మధ్య భారత దేశంలో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఇంకా రుతుపవనాలకు ముందస్తుగా వచ్చే తీవ్రమైన వేసవి తుఫానులు, ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీస్తున్నాయి. మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి వచ్చే ‘వెస్ట్రన్ డిస్టర్బెన్స్’ (పశ్చిమ అల్లకల్లోలం) అనే వాతావరణ మార్పుల వల్ల హిమాలయాలు, పరిసర మైదాన ప్రాంతాల్లో హఠాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోయి వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో చెట్ల కింద ఆశ్రయం పొందకుండా, ఇళ్లలోనే సురక్షితంగా ఉండటం మంచిది. ఈ వర్షాల ముగిసిన తర్వాత వాతావరణం మళ్లీ వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. వాయవ్య భారతంలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 3 నుండి 5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో మళ్లీ తీవ్రమైన వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 39 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతూ, గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉండనుంది.




