Minister Kolusu Parthasarathy: ఆంధ్రప్రదేశ్లో పేదలకు గృహ వసతి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు మంత్రి కొలుసు పార్థసారథి.. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేస్తోంది. మంత్రి పార్థసారథి వెల్లడించిన వివరాల ప్రకారం, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 8 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అధిక నిధులు కేటాయించి ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసినట్లు తెలిపారు..
2019-24 మధ్య 6 లక్షల ఇళ్ల నిర్మాణం
2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో సుమారు 6 లక్షల ఇళ్ల నిర్మాణం మాత్రమే జరిగినట్లు పేర్కొన్నారు పార్థసారథి.. దీంతో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. అయితే, పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగా, 10 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. వీటిలో పరిశీలన అనంతరం 9 లక్షలకు పైగా దరఖాస్తులు అర్హత సాధించినట్లు వెల్లడించారు.
కేంద్రం నుంచి మరిన్ని ఇళ్ల మంజూరుపై దృష్టి
అర్హులైన ప్రతి కుటుంబానికి గృహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగిస్తున్నట్లు తెలిపారు మంత్రి పార్థసారథి… త్వరలో కేంద్రం నుంచి మరిన్ని ఇళ్ల మంజూరు పొందేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని వెల్లడించారు.. రాష్ట్రంలోని పేదలకు సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గృహ నిర్మాణ కార్యక్రమాన్ని విస్తరిస్తోంది. కేంద్ర సహకారంతో మరిన్ని ఇళ్లు మంజూరు చేయించి అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి..




