Malaria Scare in Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో జ్వరాలు ప్రబలుతున్నాయి. పాచిపెంట మండలంలోని గరిసిగుడ్డి పంచాయతీ పరిధిలోని తాడివలస, జీలకవలస గ్రామాల్లో ఇప్పటివరకు సుమారు 25 మంది వరకు జ్వరాలతో బాధపతున్నారు. వీరిలో 10 మందికి మలేరియాగా చెబుతున్నారు. జ్వరాలతో బాధపడుతున్న 15 మంది ప్రస్తుతం సాలూరు ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో 10 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయి స్వగ్రామాలకు వెళ్లిపోయారు.
జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు వారం రోజుల క్రితం గురునాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్య సిబ్బంది ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించారు. అయినప్పటికీ జ్వరాలు అదుపులోకి రాకపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. గ్రామాల్లో కలుషిత నీరు, గెడ్డ నీటిని తాగడం వల్లే జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే గ్రామాల్లో బోర్లు ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా సింగిల్ ఫేజ్గా ఉండటంతో మోటార్లు పనిచేయడం లేదు. దీంతో స్వచ్ఛమైన తాగునీటి కొరత ఏర్పడిందని గిరిజనులు చెబుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, పారిశుధ్య చర్యలు చేపట్టడంతో పాటు వైద్య సేవలను మరింత విస్తరించాలని కోరుతున్నారు.




