Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ కుదుపునకు తెర లేచింది. శివసేనలో గతంలో జరిగిన చీలిక గుర్తు తెచ్చేలా, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యుబిటి)ని లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ టైగర్’ తుది అంకానికి చేరుకుంది. ఉద్ధవ్ సేనకు చెందిన 9 మంది లోక్సభ ఎంపీల్లో ఆరుగురు పార్టీ వీడి, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వైపు వెళ్లేందుకు సర్వం సిద్ధమైంది. దీంతో మహారాష్ట్ర రాజకీయ రణరంగం కాస్తా దేశ రాజధాని ఢిల్లీకి మారింది. గతంలో బెంగాల్లోని టీఎంసీ తిరుగుబాటుకు బీజేపీ నేత భూపేంద్ర యాదవ్ నివాసం ఎలా కేంద్ర బిందువుగా మారిందో, ఇప్పుడు శివసేన (యుబిటి) ఎంపీల తిరుగుబాటుకు ఏకనాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఢిల్లీ నివాసం ప్రధాన కేంద్రంగా మారింది.
‘మాతోశ్రీ’కి దూరంగా ఎంపీలు
ఆపరేషన్ టైగర్ ఊహాగానాల నడుమ, గత ఆదివారం ఉద్ధవ్ ఠాక్రే తన నివాసమైన మాతోశ్రీలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి 9 మంది ఎంపీల్లో కేవలం నలుగురు (అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, సంజయ్ దీనా పాటిల్, రాజాభౌ వాజే) మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఐదుగురు ఎంపీలు ఓంరాజే నింబాల్కర్, సంజయ్ జాదవ్, భౌసాహెబ్ వాక్చౌరే, సంజయ్ దేశ్ముఖ్, నాగేష్ పాటిల్ ఆస్తీకర్ ఈ భేటీకి దూరంగా ఉన్నారు. వచ్చే 48 గంటల్లో మాతోశ్రీకి వచ్చి పార్టీపై విధేయత నిరూపించుకోవాలని ఉద్ధవ్ ఆదేశించినప్పటికీ, వారు రాకపోవడంతో పార్టీలో చీలిక ఖాయమని ఉద్ధవ్కు ముందే సంకేతాలు అందాయి. షిండే వర్గంలోకి వెళ్లేందుకు సిద్ధమైన ఆరుగురు ఎంపీలలో నాగేష్ పాటిల్ ఆస్తీకర్, సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్ముఖ్, భౌసాహెబ్ వాక్చౌరే, ఓంరాజే నింబాల్కర్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆరో ఎంపీ ఎవరనేది ఇంకా సస్పెన్స్గా ఉంది. మరోవైపు శివసేన ఎమ్మెల్సీ కృపాల్ తుమనే మాట్లాడుతూ.. మొత్తం 7 గురు ఎంపీలతో చర్చలు ముగిశాయని, వారంతా షిండే వర్గంలో చేరడం ఖాయమని, ఈ ప్రక్రియ గత నెల రోజులుగా సాగుతోందని బాంబు పేల్చారు.
ఢిల్లీలో హైడ్రామా – స్పీకర్ భేటీకి సిద్ధం
ఉద్ధవ్ క్యాంప్కు చెందిన అసమ్మతి ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మౌలానా ఆజాద్ రోడ్డులోని శ్రీకాంత్ షిండే నివాసంలో ఏకనాథ్ షిండేతో వీరు కీలక భేటీ జరపనున్నారు. ఈ సమావేశం అనంతరం అసమ్మతి ఎంపీలంతా కలిసి లోక్సభ స్పీకర్ను కలవనున్నారు. సభలో తాము ప్రత్యేక గ్రూపుగా వ్యవహరిస్తామని, ఆ తర్వాత షిండే నేతృత్వంలోని అసలు శివసేనలో విలీనమవుతామని మద్దతు లేఖను స్పీకర్కు సమర్పించనున్నట్లు సమాచారం. ఒకవైపు షిండే వర్గం వ్యూహాలు పన్నుతుంటే, మరోవైపు నష్ట నివారణ చర్యలు, న్యాయ సలహాల కోసం ఠాక్రే వర్గం కూడా ఢిల్లీలో రంగంలోకి దిగింది. ఎంపీల ఫిరాయింపులను అడ్డుకునేందుకు శివసేన (యుబిటి) పార్లమెంటరీ పార్టీ నేత అరవింద్ సావంత్ లోక్సభ స్పీకర్కు ఒక అధికారిక లేఖ రాశారు. పార్లమెంట్లో కేవలం తమ గ్రూపునే అధికారిక పార్టీగా గుర్తించాలని, వేరే ఏ వర్గమైనా ప్రత్యేక గుర్తింపు కోరితే తమ పక్షం వినకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. అలాగే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్, లోక్సభ ఎంపీ అనిల్ దేశాయ్ సైతం ఢిల్లీ చేరుకున్నారు. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్కు ముందే సంజయ్ రౌత్ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ఒక్కో ఎంపీకి రూ. 15 కోట్ల చొప్పున ఆఫర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఉత్కంఠ పీక్స్కు చేరింది. రాబోయే కొన్ని గంటల్లోనే ఉద్ధవ్ ఠాక్రే కోట మరోసారి బద్దలు కానుందా లేదా అనేది తేలిపోనుంది.




