Konda Surekha vs Congress High Command: తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. తనను మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, రాజీనామా చేసే అవసరం ఏముందని ప్రశ్నించారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలు చూస్తే.. కాంగ్రెస్ అధిష్టానంతో ఆమె యుద్ధానికి దిగుతున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గేతో చర్చించినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రస్తుత పరిణామాలపై ఆయనకు లిఖితపూర్వకంగా లేఖ అందజేశానని వెల్లడించారు. తనకు సహకరించాలని ఖర్గేను కోరగా.. సమస్యను పరిశీలిస్తామని ఆయన చెప్పినట్లు సురేఖ పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా లేఖ పంపించినట్లు మంత్రి సురేఖ చెప్పారు.
తనను రాజీనామా చేయాలని హైకమాండ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశం రాలేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ‘నేను ఏం తప్పు చేశాను?, ఎందుకు రాజీనామా చేయాలి?’ అంటూ ప్రశ్నించారు. తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలను తన వ్యాఖ్యలుగా పరిగణించడం సరికాదన్నారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటికి తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే కూతురు వ్యాఖ్యలను కూడా పార్టీ అధిష్ఠానం సీరియస్గా తీసుకుంది. ఈ అంశంపైనే కాంగ్రెస్ హైకమాండ్, రాష్ట్ర నాయకత్వం మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పించే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన వెంటనే మంత్రి సురేఖ బర్తరఫ్కు సంబంధించిన లేఖను లోక్భవన్కు పంపించే అవకాశం ఉంది. బర్తరఫ్ అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకునే పరిణామాలపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించినట్లు సమాచారం. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారాలకు సంబంధించి సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు ముఖేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సహా పలువురు సీనియర్ నేతల నుంచి అధిష్ఠానం ఇప్పటికే అభిప్రాయాలను సేకరించింది.




