ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే తన బౌలింగ్ విభాగంపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ప్రదర్శన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిందని ఆయన కొనియాడారు.
బౌలర్ల నిలకడపై రహానే ప్రశంసలు..
సన్రైజర్స్ హైదరాబాద్ ఒక దశలో 190-200 పరుగులు చేసేలా కనిపించినా, కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా పుంజుకుని వారిని 165 పరుగులకే కట్టడి చేశారు. వరుణ్ చక్రవర్తి (3/36), సునీల్ నరైన్ (2/31) కీలక వికెట్లు తీసి హైదరాబాద్ను దెబ్బతీశారు. ఈ విజయంపై రహానే స్పందిస్తూ.. “గత 5-6 మ్యాచ్లుగా మా బౌలింగ్ యూనిట్ చాలా నిలకడగా రాణిస్తోంది. బౌలింగ్ కోచ్లు బ్రావో, టిమ్ సౌథీల కృషి ఇందులో ఎంతో ఉంది” అని పేర్కొన్నారు. తొలి 5 మ్యాచ్ల్లో ఓడిపోయినా జట్టులో వాతావరణం ప్రశాంతంగా ఉండటం ప్లస్ పాయింట్ అని ఆయన చెప్పారు. బౌలర్లు అద్భుతంగా రాణిస్తుండటమే మా విజయాలకు కారణం అని పేర్కొన్నాడు.
బ్యాటింగ్లో రాణించిన రఘువంశీ, రహానే
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్, మరో 10 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. అంగ్క్రిష్ రఘువంశీ, రహానే (43) కలిసి రెండో వికెట్కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన వరుణ్ చక్రవర్తిపై రహానే ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. కష్టమైన ఓవర్లలో కూడా అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని అభినందించారు. 9 మ్యాచ్లు ఆడిన కేకేఆర్ మరో 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇదే జోరును కొనసాగించి.. మిగిలిన వాటిలో కూడా గెలిస్తే మొత్తం 17 పాయింట్లు వస్తాయి. దీంతో ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశాలు మిగిలిన జట్ల పాయింట్స్, రన్ రేట్ పై ఆధారపడి ఉంటుందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.
అలసత్వమే దెబ్బతీసింది: పాట్ కమిన్స్
తమ ఓటమిపై ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఆరంభం బాగున్నా, పిచ్ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటర్లు ఆడలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. “మేము 180-200 స్కోరు చేయాలని భావించాం, కానీ మధ్యలో తడబడ్డాం. నా ఓవర్లో 27 పరుగులు ఇవ్వడం కూడా మ్యాచ్పై ప్రభావం చూపింది” అని కమిన్స్ ఒప్పుకున్నారు.




