Kerala: కేరళలో ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో ముస్లిం లీగ్ ఎమ్మెల్యే ఫాతిమా తాలియా సంప్రదాయ ‘‘దీపం’’ వెలిగించడం వివాదంగా మారింది. ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్(ఐయూఎంఎల్) తొలి మహిళా ఎమ్మెల్యే ఫాతిమా ఇప్పుడు మత పెద్దల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. సున్నీ మత సంస్థ ‘‘సమస్త’’ దీపం వెలిగించడంపై అభ్యంతరం తెలిపింది. తన నియోజకవర్గమైన పెరంబరలో జరిగిన ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫాతిమా దీపం వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ముస్లిం మతపెద్దల్లో దీనిపై చర్చ ప్రారంభమైంది.
ఇస్లాం బోధనలపై ఆధారపడని, ఇతర మతాల ఆచారాలుగా పరిగణించబడే చర్యలకు ముస్లింలు దూరంగా ఉండాలని సమస్తా పేర్కొంది. ఇతర మతాలు వారు, వారి మతంలో దీపం వెలిగించే సంప్రదాయాన్ని పాటిస్తారని పేర్కొంది. ఒక వేళ ముస్లిం అలాంటి మత చిహ్నాలకు లేదా ఆచారాలు పాటిస్తే, అది మత ఉల్లంఘనలకు దారి తీస్తుందని ఆ సంస్థ చెప్పింది. అయితే, దీపాన్ని కేవలం వెలుగు కోసం మాత్రమే వెలిగించడం, దానికి ఏ మతపరమైన ఆచారాలు, భావోద్వేగాలతో సంబంధం లేకపోతే దానిని భిన్నంగా చూడవచ్చని పేర్కొంది.




