స్లోవేకియాలోని ఒక పురాతన స్థావరం వద్ద దాదాపు 7,000 ఏళ్ల నాటి రాతియుగం నాటి ఒక వింతైన రహస్యాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సెంట్రల్ యూరప్లోని అతిపెద్ద ప్రారంభ వ్యవసాయ కూడళ్లలో ఒకటైన ‘వ్రాబుల్’ అనే నియోలిథిక్ స్థావరం చుట్టూ ఉన్న ఒక అగడ్తలో దాదాపు 80 మానవ అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. అయితే, వీటిలో ఒక చిన్న బిడ్డకు సంబంధించిన అస్థిపంజరానికి మాత్రమే తల ఉంది, మిగిలిన 79 అస్థిపంజరాలకు తలలు లేవు.
ఈ ఆవిష్కరణ శాస్త్రవేత్తలను గందరగోళానికి గురిచేస్తోంది. ప్రారంభంలో వీరంతా ఏదైనా హింసాత్మక దాడి లేదా ఊచకోతకు గురై ఉంటారని భావించారు. కానీ కీల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం, వీరు హింస కారణంగా మరణించలేదని, మరణించిన తర్వాతే ఉద్దేశపూర్వకంగా తలలను వేరు చేశారని తేలింది. మానవ శరీర నిర్మాణ శాస్త్రం పై అవగాహన ఉన్నవారే చాలా జాగ్రత్తగా ఈ తలలను వేరు చేసినట్లు అస్థిపంజరాలపై ఉన్న గుర్తులు, వాటి అమరికను బట్టి తెలుస్తోంది. ఇది యుద్ధం లేదా గొడవల వల్ల జరిగిన గందరగోళం కాదని, ఒక ప్రణాళికాబద్ధమైన ఆచారం లేదా సంప్రదాయంలో భాగంగానే జరిగిందని పరిశోధకులు నిర్ధారించారు.
మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తొలగించిన ఆ తలలు ఎక్కడా లభించలేదు. ఆనాటి వ్యవసాయ సమాజాల నమ్మకాల్లో తలలకు ఏదైనా ప్రత్యేకమైన లేదా పవిత్రమైన ప్రాముఖ్యత ఉండి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. కొన్ని అస్థిపంజరాలు బోర్లా పడుకోబెట్టి ఉండగా, మరికొన్ని జంటలుగా ఉన్నాయి. ఈ వింత ఆవిష్కరణ రాతియుగం నాటి ఐరోపా ప్రజల మరణం, అంత్యక్రియల ఆచారాలపై ఉన్న పాత అంచనాలను సవాలు చేస్తోంది. ఈ తలలు లేని అస్థిపంజరాల వెనుక ఉన్న అసలు కారణం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది.




